`మహా`రచ్చకు బ్రేక్ పడింది. తాజా
అసెంబ్లీ ఎన్నికల్లో
బీజేపీ 105,
శివసేన 56 సీట్లు గెలుచుకున్నాయి. అయితే అధికారాన్ని పంచుకోవాలన్న నిబంధనను
శివసేన ఒత్తిడి చేయడంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది.
శివసేన కేంద్రంగా అస్పష్టత కొనసాగుతూనే ఉండటంతో...అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం గడుస్తున్నా, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చిక్కుముడి వీడని పరిస్థితికి తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్.. నవంబర్ 5వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కొన్ని వర్గాల ద్వారా సమాచారం అందింది. స్వంతంగానే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈనెల 6 లేదా 7వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుందని
బీజేపీ నేతలంటున్నారు.
మరోవైపు, నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. సీఎం పదవి విషయంలో వెనక్కి తగ్గేది లేదని
శివసేన మరోసారి సంకేతాలిచ్చింది.
లోక్సభ ఎన్నికలకు ముందు రెండు పార్టీల మధ్య కుదిరిన 50-50 ఫార్ములాను అమలుచేయాల్సిందేనని పార్టీ పత్రిక ‘సామ్నా’లో డిమాండ్ చేసింది.ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ గురువారం
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంటికి వెళ్లి చర్చించారు. అయితే పవార్ను తాను మర్యాదపూర్వకంగానే కలిశానని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. సీఎం పదవి విషయంలో
శివసేన మెత్తబడిందని వస్తున్న వార్తలను ఖండించారు. వారం రోజుల్లో సంజయ్ రౌత్
ఎన్సీపీ అధినేతను కలువడం ఇది రెండోసారి.
ఇదిలాఉండగా.... కూటమి నుంచి
శివసేన దూరంగా ఉన్నా.. బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్దమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించనున్నారు.ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్ల బాధ్యతలను
బీజేపీ ఎమ్మెల్యే ప్రసాద్ లాడ్, చంద్రకాంత్ పాటిల్ తీసుకున్నారు. ఈ ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై
శివసేన వైఖరి తెలియాల్సి ఉంది.