సీబీఐ తీర్పు విష‌యంలో...వివిధ పార్టీలు, నాయ‌కుల తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య స్పందించారు. వైయస్ఆర్ కడప జిల్లాలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేయడం అవివేకమ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ``జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని గౌరవిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి.. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడు. ఆ కేసుతో పాటు అనేక కేసుల్లో చంద్రబాబు స్టేలు తెచ్చుకోలేదా? జగన్ నేరస్తుడు కాదు...ఆయనపై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి...`` అని స్ప‌ష్టం చేశారు. 


రాష్ట్రంలో ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని రామ‌చంద్ర‌య్య తెలిపారు. ఈ అంశాల నేప‌థ్యంలో మినహాయింపు ఇవ్వమని కోర్టుకు అప్పీల్ చేసుకున్నారు అని వెల్ల‌డించారు. ``CBI కోర్టు చెప్పేది ఫైనర్ నిర్ణయం కాదు, ఇంకా పై కోర్టులు ఉన్నాయి...చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు, కాబట్టి కొన్ని రోజులు ఎదురు చూడండి, ఈ విధమైన ఆరోపణలు చేయడం సరి కాదు. ఖాళీగా లేని కుర్చీకోసం చంద్రబాబు ప్రాకులాడుతున్నారు. మా ప్రభుత్వానికి 5 ఏళ్ళు అధికారంలో ఉండమని ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఇంకా నాలుగున్నర సంవత్సరాల  పాటు ఆ సీటు  ఖాళీ కాదు...ఘోరంగా ఓడిపోయానన్న చింత చంద్రబాబుకు ఏమాత్రం లేకపోగా.. ఆయన్ను ఓడించామని ప్రజలు బాధపడుతున్నారని అతనికతనే సొంత డబ్బా కొట్టుకోవడం విడ్డూరం`` అని ఎద్దేవా చేశారు.  


ఆంద్రప్రదేశ్‌లో ముగ్గురు మోడీలన్న చంద్రబాబు ఎన్నికల తర్వాత మళ్ళీ బీజేపీ నాయకుల వద్దకు చేరాడని రామ‌చంద్ర‌య్య ఎద్దేవా చేశారు. ``అక్రమంగా సంపాదించిన డబ్బుతో పెయిడ్ ఆర్టిస్టులతో బురద జల్లే ప్రయత్నం చంద్రబాబు పదే పదే చేస్తున్నాడు...గతంలో చంద్రబాబు అనేక సార్లు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. చంద్రబాబుకు కొన్ని చిల్లర పార్టీలు మాత్రమే సపోర్టు చేస్తున్నాయి. ప్రజల మద్దతు లేదు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో...ఆయన ఇంటి పక్కనే కృష్ణా నదీ గర్భంలో ఇసుక అక్రమంగా తవ్వారని వంద కోట్లు పెనాల్టీ వేశారు`` అని రామ‌చంద్ర‌య్య గుర్తు చేశారు. చంద్రబాబు తలపెట్టిన కార్యక్రమాలన్నీ పవన్ కళ్యాణ్ నెత్తిన వేసుకుంటాడని రామ‌చంద్ర‌య్య వ్యాఖ్యానించారు. ఒక పార్టీ అధ్యక్షుడు దేశ చరిత్రలో రెండు చోట్ల పోటీ చేస్తే.. రెండు చోట్లా ఓడిపోవడం మొదటిసారి అని ఎద్దేవా చేశారు. 


సీఎం జగన్‌కు, వైఎస్ఆర్సీపీ పార్టీకి పత్రికా స్వేచ్ఛ మీద, ప్రజాస్వామ్యం పైనా పూర్తి విశ్వాసం ఉందని రామచంద్ర‌య్య స్ప‌ష్టం చేశారు. ``ప్రభుత్వం తప్పు చేస్తే తప్పకుండా వార్తలు రాయచ్చు, కానీ తప్పు చేయకుండా తప్పుడు వార్తలు రాస్తే చర్యలు తీసుకోవద్దా? తప్పుడు వార్తలు రాయడానికి.. వారికి ఏ రాజ్యాంగం హక్కు కల్పించింది.` అని స్ప‌ష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: