హైద‌రాబాద్ ట్రాఫిక్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దేశంలోని మిగ‌తా మెట్రో న‌గ‌రాల్లోని ట్రాఫిక్‌తో పోలిస్తే..ఒకింత మెరుగే అయిన‌ప్పటికీ...ఇక్క‌డి క‌ష్టాలు ఇక్క‌డ ఎలాగూ ఉన్నాయి. అయితే, నగర ట్రాఫిక్ చిక్కులను ఎదుర్కోనేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్దం చేసింది. గత కొన్ని నెలలుగా నగరంలో నిర్మించాల్సిన స్లిప్ రోడ్ల అంశం కొలిక్కి వచ్చింది. ఈమేరకు జీహెచ్ఎంసీ అర్బన్ టౌన్ ప్లానర్లు, ట్రాఫిక్ సిబ్బంది, నగర పోలీసులు, రియల్ ఎస్టేట్ ప్రతినిధుల నివేదికలు, ప్రజల సూచనల ప్రాతిపాదికల మేరకు ఒక ప్రణాళికను సిద్దం చేసింది. ఈ మేరకు నగర రోడ్లకు అనుసంధానంగా చేపట్టాల్సిన ఉపరోడ్ల (స్లిప్ రోడ్లు, అనుబంద రోడ్లు) మీద రియల్ ఎస్టేట్ ప్రతినిధులు, అధికారులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఒక సమావేశాన్ని నిర్వహించారు.


ఈ సంద‌ర్భంగా మంత్రి ఈ స‌మావేశంలో మాట్లాడుతూ...ఇప్పటికే గ్రేట‌ర్ అధికారులు ఇప్పటికే పలు స్లిప్ రోడ్లను గుర్తించారని దీంతోపాటు నగర ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు అధికారులకు సూమారు 300 సూచనలు వచ్చాయని, వాటిని పరిగణలోకి తీసుకున్నామని, ఈ సూచనల్లో అత్యధికం శాతం రోడ్లను తమ అధికారులు ఇప్పటికే గుర్తించారని తెలిపారు. ఇందుకోసం తమ అధికారులు ట్రాఫిక్ అధ్యయనం చేశారని, దీంతోపాటు క్షేత్రస్ధాయిలో పర్యటించి రూపొందించిన నివేదికల అధారంగా స్లిప్ రోడ్లను గుర్తించామన్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలో గుర్తించిన స్లిప్ రోడ్లను మూడు రకాల ప్రాధాన్యతలుగా గుర్తించి, అత్యధిక ట్రాఫిక్ ఇబ్బందులున్న చోట్ల, అతి స్వల్పకాలంలోనే పూర్తి చేయగల రోడ్ల పనులు చేపట్టాలని మంత్రి అధికారులకు అదేశించారు. పలు రోడ్ల మద్య అనుసంధానంగా ఏర్పాటు చేయబోయే రోడ్ల వలన కనెక్టివిటీ పెరుగుతుందని తెలిపారు.


ఇంతేకాకుండా...ప్రస్తుతం వెంటనే పనులు ప్రారంభించే రోడ్లు ఒక్క అధికారి భాద్యత తీసుకుని పనులు వేగంగా జరిగేలా చూడాలన్నారు. ఇందుకోసం జోనల్ కమీషనర్లు అయా అధికారులను నియమించాలన్నారు. దీంతోపాటు పలు జంక్షన్లలోనూ చిన్న చిన్న మార్పులతో ట్రాఫిక్ తగ్గే అవకాశాలున్న చోట్ల సైతం పనులు ప్రారంభించాలన్నారు. ఇప్పటికే నగరంలో ఎస్సార్డిపి, కాంప్రహెన్సివ్ రోడ్డు మెయింటెనెన్స్ ప్రొగ్రామ్ (సిఅర్ యంపి) వంటి కార్యక్రమాలతో రోడ్ నెట్ వర్క్ బలోపేతానికి పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు.


రియల్ ఎస్టేట్ ప్రతినిధులు పలు నూతన స్లిప్ రోడ్ల వివరాలను అందించారు. ఈ రోడ్ల వలన ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని తెలిపారు. నగరంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ది పథాన సాగుతున్నదని, ఇందుకోసం ప్రభుత్వ సహాకారం కొనసాగుతున్నదని హమీ ఇచ్చారు. ఇదే సమయంలో అన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని రియల్ ఎస్టేట్ ప్రతినిధులను కోరారు. దీంతోపాటు మల్టిలెవల్ కార్ పార్కింగ్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి వారిని కోరారు. ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ , ఇతర ఉన్నతాధికారులు, మరియు రియల్ ఎస్టేట్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: