హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న మజ్ల్లిస్-ఎ-ఇత్తేహాదుల్ ముస్ల్లిమీన్ (మజ్ల్లిస్) పార్టీ దూకుడు కొనసాగిస్తోంది. ఇటీవల జరిగిన
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, బీహార్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎంఐఎం తన ఉనికిని చాటుకున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో రెండు శాసనసభ స్థానాలతో పాటు బీహార్లోని కిషన్గంజ్ స్థానంలోనూ మజ్ల్లిస్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో తమ పార్టీని మరింత విస్తరించాలన్న యోచనలో ఆ పార్టీ ఉంది. జార్ఖండ్
అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన జార్ఖండ్లోనూ బరిలో దిగనుంది. ముస్లింల ప్రాబల్యం ఉన్న 10 నుంచి 12 స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దించాలని భావిస్తోంది.
కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉన్నాయి. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకు మొత్తం ఐదు విడుతల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించింది.తొలి విడుతలో 13 స్థానాలకు నవంబర్ 30న, రెండో విడుతలో 20 నియోజకవర్గాలకు డిసెంబర్ 7న, మూడో విడుతలో 17 స్థానాలకు డిసెంబర్ 12న, నాలుగో విడుతలో 15 స్థానాలకు డిసెంబర్ 16న, చివరి విడుతలో 16 నియోజకవర్గాలకు డిసెంబర్ 20న పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 23న ఫలితాలు ప్రకటించనున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో 14 శాతం ముస్లిం
జనాభా ఉంది. ముస్లింల ప్రాబల్యం ఉన్న 10 నుంచి 12 స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దించాలని భావిస్తోంది. ఈ మేరకు విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఎంఐఎం లెక్కలు ఫలిస్తే..మరో రాష్ట్రంలో ఆ పార్టీ జెండా ఎగురవేయనుంది.
కాగా, బీహార్లోని కిషన్గంజ్ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఎంఐఎం గెలువడంపై
బీజేపీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహ్మద్
అలీ జిన్నా సిద్ధాంతాన్ని ఎంఐఎం పాటిస్తుంటుందని, అలాంటి పార్టీ కిషన్గంజ్లో గెలువడం బీహార్కే ప్రమాదకరమని అన్నారు. కిషన్గంజ్లో జిన్నా సిద్ధాంతాలను పాటించే వాళ్లు, జాతీయగీతం వందేమాతరాన్ని వ్యతిరేకించేవాళ్లు గెలిచారని, వీరితో బీహార్లోని సామరస్య వాతావరణం దెబ్బతినే ప్రమాదమున్నదని పేర్కొన్నారు. ఎంఐఎం గెలుపు రాష్ర్టానికే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.