రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. అర్జీదారులను మరింతగా మెప్పించే రీతిలో వారి సమస్యలకు పరిష్కారం చూపనున్నారు. ప్రజల నుంచి వచ్చే వినతులను మొక్కుబడిగా పరిష్కరించినట్లు కాకుండా మరింత పారదర్శకంగా.. నిజాయితీ, చిత్తశుద్ధితో పరిష్కరించాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ విషయంలో ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచేందుకు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు.


సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో పలు శాఖల అధికారులు ఇప్పటికే ఈ అంశంపై రాష్ట్ర స్థాయిలో సదస్సులు నిర్వహించారు. వీటికి కొనసాగింపుగా ఈ నెల 5 నుంచి 13 వరకు జిల్లా స్థాయిల్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కలిపి విజయనగరంలో ఈ నెల 5న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎస్‌ఐలకు శిక్షణనిస్తారు.


 ప్రజల వినతులను మరింత నాణ్యతతో ఎలా పరిష్కరించాలనే దానిపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు వివరిస్తారు.  ఆ తర్వాత.. ఇంటి స్థలాలు, రేషన్‌ కార్డులు, పింఛన్ల కోసం అర్జీలు సమర్పించే వారిని సంతృప్తిపరిచే రీతిలో వాటిని ఎలా పరిష్కరించాలో వివరిస్తారు. అలాగే, పోలీసు శాఖకు వచ్చే వినతుల పరిష్కార విధానాన్ని చెబుతారు.ఇక మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అధికారులు బృందాలుగా ఏర్పడి నిర్దిష్టమైన ఒకవినతిని పరిష్కరించడంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి.


ఎలాంటి తప్పులు దొర్లుతున్నాయనే అంశాలపై చర్చించడంతో పాటు వాటిని అధిగమించేందుకు అవసరమైన సూచనలు, సలహాలు స్వీకరిస్తారు.ఇదిలా ఉంటే.. గ్రామ, వార్డు సచివాలయాల్లో కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమైతే ఇక అక్కడ ప్రతీరోజూ స్పందన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇప్పుడు జిల్లా స్థాయిలో శిక్షణ పొందే అధికారులు ఆ తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు, వలంటీర్లకు శిక్షణ ఇస్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: