కొత్త టీవీ కొనాల‌ని అనుకుంటున్నారా? స‌్మార్ట్ టీవీల‌లో వినూత్నత కోసం ప్ర‌య‌త్నిస్తున్నారా? అయితే...ఈ శుభ‌వార్త మీ కోస‌మే. ప్రస్తుతం భారత్‌లో 32 ఇంచుల నుంచి 65 ఇంచుల లోపు సైజు కలిగిన టీవీలు రూ.13,999 ప్రారంభ ధరలో లభిస్తున్నాయి. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తున్న ఎన్నో కంపెనీలు స్మార్ట్‌ టీవీల విభాగంలోకి ప్రవేశించాయి. వీటిలో సామ్‌సంగ్‌, మైక్రోమాక్స్‌, ఇంటెక్స్‌, షియోమీ, మోటరోలా, వన్‌ప్లస్‌లు ఉన్నాయి. తాజాగా స్మార్ట్‌ టీవీల విభాగంలోకి మ‌రో ప్ర‌ముఖ సంస్థ‌ అడుగు పెట్టబోతోంది. ఆ సంస్థే నోకియా.


ఇటీవ‌లే...మొబైల్‌ సంస్థ మోటరోలాను కొనుగోలు చేసిన నోకియా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వినియోగదారుల రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంలో భాగంగా నోకియా బ్రాండ్‌తో టీవీలను త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతోంది. భార‌తదేశ స్మార్ట్‌ టీవీల విభాగంలోకి అడుగు పెట్టే క్ర‌మంలో ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లలో ఒకటైన నోకియాతో జతకట్టడంతో దేశీయంగా అత్యంత వేగంగా దూసుకుపోతున్న ప్రొడక్ట్‌ విభాగంలో ప్రవేశించడం మంచి పరిణామమని ఫ్లిప్‌కార్ట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆదర్శ్‌ మీనన్‌ తెలిపారు. త‌మ ఉత్పత్తులు వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేలా ఉండ‌నున్న‌ట్లు ఆయ‌న ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.


కాగా, దేశీయ కస్టమర్లు కోరుకుంటున్న విధంగా టీవీలను తీర్చిదిద్దనున్న సంస్థ..ఇందుకోసం ప్రత్యేక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఫ్లిప్‌కార్ట్‌ ఉన్నట్లు తెలుస్తున్నది. ఎన్ని మోడళ్లు, వాటి ధర, విడుదల చేసే తేది ఇతర విషయాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌..మార్క్‌క్యూ ప్రైవేట్‌ లేబుల్‌తో టీవీలను విక్రయిస్తున్నది. 24 ఇంచుల నుంచి 65 అంగుళాల లోపు కలిగిన ఈ టీవీలు రూ.6,999 మొదలుకొని రూ.64,999 లోపు లభించనున్నాయి. కాగా, నోకియా నిర్ణ‌యం...మార్కెట్‌లో కీలక మార్పుల‌కు వేదిక అవుతుంద‌ని భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: