ఆఫీస్లోనే
పెట్రోల్ పోసి తహసీల్దార్ విజయారెడ్డిని నిప్పటించి
హత్య చేసిన నిందితుడు
సురేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తీవ్ర కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ పరిస్థితి విషమించడంతో గురువారం మృతిచెందినట్లు ఈ రోజు సాయంత్రం వైద్యులు ప్రకటించారు. ఉదయమే ఆయన మృతిచెందినట్లు...కొన్ని ఛానల్లలో ప్రచారం జరిగినప్పటికీ...అధికారికంగా తాజాగా ప్రకటించారు. అధికారికంగా ప్రకటించేందుకు ఒక ప్రక్రియ ఉంటుందని, దాన్ని పూర్తి చేసిన అనంతరమే...నిర్ణయం వెలువరించామని వైద్యులు తెలిపారు. ఉదయం సురేష్ కుటుంబ సభ్యులు ఏడూస్తూ బయటకు రావడంతో...ఛానెల్లు అలా స్క్రోలింగ్ వేసి ఉంటాయని..ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.
ఈ నెల 4వ తేదీన అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సురేష్ పెట్రోల్ పోసి తగలబెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా...దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. భూ పట్టా విషయంలో జరుగుతున్న జాప్యంతో
సురేష్ విసిగిపోయి
పెట్రోల్ బాటిల్తో తహసీల్దార్ ఆఫీస్కొచ్చి ఎమ్మార్వో గదిలోకి వెళ్లిన తలుపు మూసి ఆమెపై
పెట్రోల్ చల్లి, తనపై కూడా చల్లకొని నిప్పటించుకున్నాడు. ఆ ఘటనలో విజయారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా,
సురేష్ మాత్రం 60% కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందాడు.
సురేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా వైద్యులు అతన్ని వెంటిలేటర్ మీదికి మార్చి రెండు సార్లు ఈసీజీ తీశారు. రెండు సార్లూ ఈసీజీలో
గుండె కొట్టుకోవడం లేదని,
హార్ట్ బీట్ ఆగిపోయినట్లుగా గుర్తించారు. దీంతో నియమిత ప్రక్రియలను అనుసరించి ఆయన మరణాన్ని అధికారులు ప్రకటించారు. కాగా, ఉస్మానియా హాస్పటల్ వద్దకు కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయి.
మరోవైపు
సురేష్ మరణ వార్తల నేపథ్యంలో....ఆయన చికిత్స పొందుతున్న వార్డు వద్ద అతని
భార్య ఇవాళ ఉదయం స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను క్యాజువాల్టీ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలాఉండగా, విజయారెడ్డిని హత్య చేసిన ఘటన గురించి సురేష్ నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. తహశీల్దార్ను ఎందుకు హత్య చేశాడన్న కోణంలో సురేశ్ నుంచి వాంగ్మూలం తీసుకున్నట్లు తెలుస్తోంది.