ఏపీ సీఎం జగన్ ఓ మంచి నిర్ణయంతీసుకుంటే చాలు చంద్రబాబుకు కడుపు మంట పుడుతుందని మంత్రి కన్నబాబు విమర్శించారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని చంద్రబాబు తప్పుబట్టడంపై మంత్రి కన్నబాబు మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ హైదరాబాద్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకోవడం వల్ల ఇంగ్లీష్‌ చక్కగా మాట్లాడగలుగుతున్నారన్నారు. పేద పిల్లలందరికీ ఇంగ్లీష్‌పై పట్టు సాధించేందుకు ఆ దిశగా ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నామన్నారు.


ప్రతి దానిపై చంద్రబాబు బురద జల్లుతున్నారని, ఇంగ్లీష్‌ మీడియం అమలుపై బురద జల్లడం మానుకోవాలని కన్నబాబు హితవు చెప్పారు. చంద్రబాబుకు తెలుగు భాషపై అంత ప్రేమ ఉంటే ఆయన కుమారుడు లోకేష్‌, మనవడు దేవాన్ష్‌ను ఎందుకు ఇంగ్లీష్‌ మీడియంలో చేర్పించారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. విద్యా ప్రమాణాలు పెంచాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారని తెలిపారు.


దేశవ్యాప్తంగా విద్యలో పోటీతత్వాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కన్నబాబు చెప్పారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఏ మంచి నిర్ణయం తీసుకున్నా చంద్రబాబుకు గిట్టడం లేదని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల సంస్కరణకు వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారన్నారు. వీటిలో చదివిన పిల్లలు ఏమాత్రం తీసిపోకుండా ఉండాలని నిర్ణయాలు తీసుకున్నారన్నారు.


ఇప్పటి వరకు 24 లక్షల మంది తెలుగు మీడియంలో చదువుతున్నారని, వీరికి ఇంగ్లీష్‌ నేర్పిస్తే ప్రపంచంతో పోటీ పడతారని సీఎం ఆలోచన చేశారన్నారు. ఇంగ్లీష్‌పై పట్టులేక ఎంతో మంది విద్యార్థులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారన్నారు. గ్రామీణ, పేద పిల్లలకు ఇంగ్లీష్‌ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడితే కమ్యూనికేషన్‌ పెరుగుతుందన్నారు. తెలుగును ఖూనీ చేస్తున్నది టీడీపీనే అని మంత్రి కన్నబాబు విమర్శించారు. ఇంగ్లీష్‌లో పూర్తిగా పట్టులేకపోతే ఎలాంటి ఇబ్బందులు పడుతారో చంద్రబాబుకు తెలుసు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: