తెలంగాణ ఆర్టీసీ కార్మికులు పిలుపునిచ్చిన చలో ట్యాంక్ బండ్ ఉద్రిక్తంగా మారింది. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు నిర్వహించనున్న సకల జనుల సామూహిక దీక్షల్లో పాల్గొనేందుకు
జిల్లా కేంద్రాల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో
హైదరాబాద్ కు తరలి వచ్చారు. మహిళా కార్మికులు కూడా భారీగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకోవడం ఇందులో విశేషం. అయితే
ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్ వైపు రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
గతంలో మిలియన్ మార్చ్ సందర్భంగా జరిగిన ఘటనల నేపథ్యంలో చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి పోలీసులు మామూలుగానే అనుమతులు నిరాకరించారు. దీనితో ట్యాంక్ బండ్ వైపు వచ్చే దారులన్నీ దాదాపుగా మూసివేశారు. వివిధ జిల్లాల నుంచి వస్తున్న కార్మికులను ట్యాంక్ బండ్ వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారు. ట్యాంక్ బండ్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన
బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య భారీ వాగ్వాదం చోటు చేసుకుంది.
కానీ భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ పోలీసు వలయాన్ని ఛేదించి
ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్ వైపు దూసుకొచ్చారు. పోలీసులు ఏర్పాటు చేసిన కంచె, బారీకేడ్లను దాటుకుని మరీ ట్యాంక్ బండ్ చేరుకున్నారు. ఒక్కసారిగా ఫెన్సింగ్ను పక్కను నెట్టేసి పరుగులు తీయడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం వారిపై చేశారు. దీనితో ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న వెంకట స్వామి విగ్రహం వద్ద ఉన్న పార్కు వద్దకు వందల సంఖ్యలో కార్మికులు ఇప్పడికే చేరుకున్నారు.
సుమారు మూడు వందల మంది
ఆర్టీసీ కార్మికులు ఎట్టకేలకు ట్యాంక్ బండ్ పైకి చేరుకుని దీక్షల్లో కూర్చున్నారు. పోలీసు వలయాన్ని ఛేదించి కార్మికులు ట్యాంక్ బండ్ కి చేరుకోవడంతో పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ట్యాంక్ బండ్పైకి వచ్చి కార్మికులను పోలీసు వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి భారీగా తరలిస్తున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉంటే .. శుక్రవారం ఉదయం నుంచే రాజకీయ పార్టీల నేతలను పోలీసులు ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.
ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డిని హిమాయత్
నగర్ సర్కిల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్యాంక్ బండ్ వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించి, అటువైపు వెళ్లే అన్ని అన్ని దారులు మూసివేశారు. అయినప్పటికీ కార్మికులు పోలీసు కంచెలను దాటి ట్యాంక్ బండ్కి చేరుకున్నారు.