మరో దేశం అగ్గిపాలయింది. అమెరికాలోని
కాలిఫోర్నియా రాష్ట్రంలో దావానలం వ్యాపించినట్లే... ఆస్ట్రేలియాలోని న్యూసౌత్వేల్స్ రాష్ట్రంలోని అడవుల్లో భారీగా మంటలు చెలరేగాయిది. దీంతో ముగ్గురు మృతిచెందగా, 30 మందికి గాయాలయ్యాయి. 150 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వేలాదిమంది గల్లంతైనట్టు అధికార వర్గాలు తెలిపాయి.
కాలిఫోర్నియా కార్చిచ్చు అమెరికాను కలవరపాటుకు గురి చేసిన సంగతి తెలిసిందే. అడవులు అంటుకుపోతున్న నేపథ్యంలో అక్కడ విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. భారీ స్థాయిలో అగ్ని కిలలు ఎగిసిపడటంతో సుమారు 36 జిల్లాల్లో విద్యుత్తు సరఫరాను నిలిపివేసినట్లు పసిఫిక్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ సంస్థ పేర్కొంది. కార్చిచ్చు వల్ల సుమారు 50 వేల మంది ఇళ్లు విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. లాస్ ఏంజిల్స్తో పాటు సొనామా కౌంటీల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. చాలా భయానకమైన పరిస్థితి నెలకొన్నదని
కాలిఫోర్నియా ఫైర్ డిపార్ట్మెంట్ ఓ ప్రకటన చేసింది.
హాలీవుడ్ స్టార్స్, సెలబ్రిటీలు ఉండే అత్యంత సంపన్న ప్రాంతం బ్రెంట్వుడ్ సహా పలు శివారు ప్రాంతాల్లో దావాగ్ని వ్యాపించింది.
కాలిఫోర్నియా అడవుల్లో మొదలైన కార్చిచ్చు క్రమంగా లాస్ ఏంజిల్స్ను తాకింది. అర్ధరాత్రి మంటలు ఎగిసిపడటంతో సెలబ్రిటీలు భయంతో ఇళ్ల నుండి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో మిలియన్ డాలర్ల విలువ చేసే ఐదు ఇళ్లు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. ఈ కార్చిచ్చు కారణంగా ఆర్నాల్డ్ కొత్త
సినిమా టర్మినేటర్ డార్క్ ఫేట్ ప్రీమియర్ షోను రద్దు చేశారు.
సరిగ్గా ఇలాంటి పరిస్థితే...ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. న్యూసౌత్వేల్స్ రాష్ట్రంలో చెలరేగిన మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. , 1500 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు చెప్పారు. కాగా, అమెజాన్.. అనంతరం కాలిఫోర్నియా...ఇప్పుడు ఆస్ట్రేలియా...ఇలా దేశాలు అగ్గి బారిన పడుతుండటం మానవాళికి ఉన్న ముప్పును చెప్తోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.