మాన‌వ‌త్వం మంట‌గ‌లుస్తోంది. కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన త‌ల్లిదండ్రులే కాసుల కోసం క‌క్కుర్తి ప‌డి వ‌స్తువు, ప‌శువుల మాదిరిగా అమ్మాయిల‌ను అమ్మేస్తున్నారు.  పెళ్లి పేరుతో సాగుతున్న ఈ దందాలో ఎంతో మంది యువ‌తుల జీవితాలు నాశ‌న‌మ‌వుతున్నాయి. తెలంగాణ‌లో గ‌త కొన్ని ఏళ్లుగా సాగుతున్న ఈ దందా వెనుక పెద్ద మాఫియా ఉన్న‌ట్లు పోలీసులు గ‌తంలోనే గుర్తించారు. అయితే చ‌ర్య‌లు నామ‌మాత్రంగా ఉంటున్నాయి.  పెళ్లి చేసుకుంటే రూ.15ల‌క్ష‌లు ఇస్తామ‌ని, అమ్మాయిని త‌మ‌తో పంపించాల్సి ఉంటుంద‌నే నిబంధ‌న‌తో  వ్యాప‌రం కొన‌సాగిస్తున్నారు.


వ్యాపారులు ఇవ్వ‌జూపుతున్న మొత్తం అమాయ‌క గిరిజ‌న త‌ల్లిదండ్రుల‌ను ప్ర‌లోభాల‌కు గురిచేస్తోంది. బ‌ల‌వుతున్న వారిలో అత్య‌ధికులు టీనేజీ వ‌య‌సులో ఉన్న‌ అమ్మాయిలే కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న అంశం. ప్ర‌భుత్వం ఎప్పుడో దీనిని గుర్తించిన చ‌ర్య‌లు స‌క్ర‌మంగా లేక‌పోవ‌డంతో తెలంగాణ గిరిజ‌న ప్రాంతాల్లో అమ్మాయిల అమ్మ‌కం ఆగ‌డం లేదు. గ‌త కొన్నేళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ దందా ఇటీవ‌లి కాలంలో జ‌డ‌లు విప్పుతోంది.


తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మ‌హ‌బూబాబాద్ ప్రాంతాల్లో ఈ సంఘ‌ట‌న‌లు ఎక్కువ‌గా చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా  మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణా వ్యాపారం సంగారెడ్డి జిల్లాకు పాకింది. సాధార‌ణంగా ముంబైకి చెందిన కొంత‌మంది వ్యాపారులు తండావాసుల‌కు డ‌బ్బు ఆశ‌చూపి అమ్మాయిల‌ను కొనుగోలు చేస్తుండ‌టాన్ని గ‌తంలో పోలీసులు గుర్తించారు. అయితే సంగారెడ్డి ఘ‌ట‌న‌లో మాత్రం రాజ‌స్థాన్‌కు చెందిన వారు వ్యాపారం పేరుతో అక్క‌డికి వ‌చ్చి అమ్మాయిల‌ను కొనుగోలు చేసి ఉత్త‌ర భార‌తానికి త‌ర‌లిస్తున్న‌ట్లు స‌మాచారం.


ఇక వీరిని అయితే వ్య‌భిచారంలోకి దించ‌డం లేదంటే... కొనుగోలు చేసిన దానికంటే  ఎక్కువ ధ‌ర‌కు అర‌బ్ షేక్‌ల‌కు...అమ్మేయ‌డం జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. ఇక ఈ అమానుష దందా ఎప్పుడు ఆగుతుందో.. ఇంకెంత‌మంది యువ‌తుల ఆ చిక్కుల్లో ప‌డి జీవితాలు బ‌లికావాలో ఆ దేవుడికే తెలియాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: