ఆదాయం పన్ను (ఐటీ) విషయంలో..ఊరింపులకు
చెక్ పడనుంది. కేంద్రం పన్నుల విషయంలో..తీపికబురు అందించనుంది. చరిత్రలో తొలిసారి...ప్రభుత్వం తీసుకున్న చొరవే...దీనికి నిదర్శనం. పన్ను విధానం, రేట్ల మార్పునకు మీ విలువైన సూచనలు ఇవ్వండి అంటూ ఓ సర్క్యులర్ను
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసింది.ఇలా జరుగడం బహుశా ఇదే తొలిసారేమో. మునుపెన్నడూ ప్రభుత్వం తమంతట తాము ఆదాయం పన్ను కోతల ఆలోచనకు వచ్చిన దాఖలాలు లేవు అని నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ ఎందుకు ఇలా అంటే...ఆర్థిక మందగమనం నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న కేంద్రం.. అడుగంటిన వినీమయ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల కోతకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే
పరిశ్రమ, వాణిజ్య సంఘాల నుంచి సూచనలు కోరుతున్నది.
ఆదాయం పన్ను (ఐటీ) తగ్గింపు దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం ఈ నెల 11న ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవిన్యూ శాఖ ఓ సర్క్యులర్ను విడుదల చేసింది. పన్ను విధానం, రేట్ల మార్పునకు మీ విలువైన సూచనలు ఇవ్వండి అంటూ ఈ నెల 21కల్లా తమకు అందివ్వాలని కోరింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) కోసం
ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో ఐటీ కోతలపై వివిధ రంగాల నుంచి అభిప్రాయాలను సేకరించి, బడ్జెట్లో ఆ మేరకు ఓ ప్రకటన చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక శాఖ.. ఇటు వ్యక్తిగత, అటు కార్పొరేట్ల ఐటీ కోతలకు సానుకూలత వ్యక్తం చేస్తున్నది. దేశ వృద్ధిరేటుకు నలువైపులా ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయ మార్గాలను కొంతమేర వదులుకునైనా.. జీడీపీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో
మోదీ సర్కారు ముందుకెళ్తున్నది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలుతో ఖజానాకు రాబడి భారీగానే తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న స్తబ్ధతను పారద్రోలేందుకు ఇటీవల కార్పొరేట్ ట్యాక్స్కూ కోత పెట్టింది. ఇదే రీతిలో మునుపెన్నడూ ప్రభుత్వం తమంతట తాము ఆదాయం పన్ను కోతల ఆలోచనకు వచ్చిన దాఖలాలు లేనప్పటికీ...ఆదాయం పన్ను హేతుబద్ధీకరణకు సుముఖంగా ఉన్నామన్న సంకేతాలను ఇస్తున్నది. ఇప్పటికే రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆది దాటితే మాత్రం రూ.2.50 లక్షల వరకే మినహాయింపు వర్తిస్తుంది. ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల వంటి పరోక్ష పన్నుల తగ్గింపునకు కేంద్రం గట్టిగానే కసరత్తు చేస్తున్నది.