తెలుగుదేశం పార్టీకి
రాజీనామా చేసిన గన్నవరం
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తాజాగా
మీడియా ముందుకు వచ్చారు. గన్నవరంలో మీడియాలో మాట్లాడిన
వంశీ ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరును తీవ్రంగా తప్పుపట్టారు. దీర్ఘకాలం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి...అధికారం పోయిన తర్వాత ఐదారు నెలలు కూడా ఆ హోదాలో ఉండలేకపోతున్నారని మండిపడ్డారు. ``కొత్త ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన కూడా ఇంకా పోలేదు. ఏ ప్రభుత్వానికి అయిన కొంత సమయం ఇవ్వాలి. వరదలు,
ప్రకృతి వల్ల ఇసుక తీయడం కుదురుతుందా? వరదలు, వర్షాల్లో కూడా ఇసుక తీసే పరిజ్ఞానం చంద్రబాబుకి ఉందేమో`` అని ఎద్దేవా చేశారు. మంచి పనులు చేస్తే స్వాగతించాలని
వంశీ సూచించారు.
డబ్బున్న వారి పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుతుంటే పేదవారు చడవకూడదా అని
వంశీ ఈ సందర్భంగా
వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై వస్తున్న విమర్శలను తప్పుపట్టారు. ఈ విషయంలో తాను ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్నానని కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు. ``తెలుగుదేశం పార్టీ పేరుకి ప్రాంతీయ పార్టీ అయిన జాతీయ పార్టీలా మిగిలింది.
టీడీపీ ఎన్నికలకు ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెబుతుంది. దీంతో ప్రజల్లో విశ్వాసం పోతోంది. పదేళ్ల క్రితం జూనియర్
ఎన్టీఆర్ కెరీర్ పణంగా పెట్టి ప్రచారం చేశారు. అయినప్పటికీ...ఆయన్ను చంద్రబాబు దూరం పెట్టారు.
ధర్మ పోరాట దీక్షలు వద్దన్నా వినలేదు. ఇదే విధంగా
తెదేపా వ్యవహరిస్తే తెలంగాణలాగే ఇక్కడ కూడా పార్టీ మిగలదు. ఏ ఎన్నికల్లోనూ
తెదేపా ఒంటరిగా పోటీ చేసి గెలవలేదు. ఇసుక దీక్ష వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో
తెదేపా నాయకులు చెప్పాలి`` అని వ్యాఖ్యానించారు.
ప్రజలు మెచ్చి గెలిపించిన నాయకుడికి మద్దతివ్వల్సిన అవసరం ఉందని వైసీపీకి మద్దతుపై తన అభిప్రాయాన్ని వల్లభనేని
వంశీ ప్రకటించారు. జగన్కు మద్దతిస్తే తనకు ఎలాంటి ప్రయోజనం లేదు, కేసులు కొత్త కాదు అని వంశీ వెల్లడించారు. `తెదేపాలో ఉన్నప్పుడే నాపై కేసులు పెట్టారు. కేసులకు నేను భయపడను. తప్పుడు కేసులు పెట్టిన వారిని ఎదుర్కొంటాను. పేదలకు, నియోజకవర్గ ప్రజలకు మంచి చేయడం కోసం ఏదైనా చేస్తాను. వైకాపాకు మద్దతిస్తా...
జగన్ తో కలిసి నడుస్తా. అవసరమైతే
ఎమ్మెల్యే పదవికి
రాజీనామా చేస్తా.వారసత్వ రాజకీయాలు నాకు అవసరం లేదు. అవసరమైతే పదవికి
రాజీనామా చేస్తా.
తెదేపా ఎమ్మెల్యేగా ఉండి.... వైకాపాకు మద్దతిస్తున్నాను. దీని ద్వారా ఎలాంటి సాంకేతిక సమస్యలు వచ్చినా నేను ఎదుర్కొంటా.`` అని ప్రకటించారు.
అభిప్రాయాలు ఎవరికైనా మారుతాయని తన రాజకీయ నిర్ణయంపై స్పందించారు. ``నా ఇబ్బంది గురించి చంద్రబాబు కు చెప్పా....అయినా స్పందన లేదు. ఒక నిర్ణయం తీసుకున్నాక స్పందిస్తే ఏం లాభం? రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా అయితే,
స్థానిక నాయకులతో కలిసి మాట్లాడాక నిర్ణయం మార్చుకున్నాను. మంచి పనులు చేస్తే వైకాపాకు మద్దతిస్తాం. లేదంటే దానికీ దూరంగా ఉంటాం``అని ప్రకటించారు.``కొన్ని వెబ్ సైట్ల ద్వారా క్యారెక్టర్ ని కించపరుస్తున్నారు. బెదిరింపు రాజకీయాలు చేసి పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉంచుతారా? `` అని ఆయన ప్రశ్నించారు.