ఎక్కడ చూడు అవినీతి. మనుషులకు అవసరమైన నిత్యావసర వస్తువులనుండి, పశువులు తినే దాణా వరకు, పసిపిల్లల పాలనుండి ఉచితంగా ప్రకృతి ఇచ్చిన ఇసుక వరకు అంతటా దోపిడే. భకారులు వేలకోట్లు తమ బొజ్జలో నింపుకుని ఎందరో పేదల ఉసురు పోసుకుంటున్నారు. అవినీతి సొమ్ము వల్ల వేలకోట్లు సంపాధిస్తాడే కానీ అంతకంతకు పాపాన్ని అనుభవిస్తాడు.
ఇకపోతే బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థ ఇసుక సరఫరా వెబ్సైట్ను హ్యాక్ చేసినట్టు రాష్ట్రంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ దశలో సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఈ సంస్ద నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఒక్క 2018 లోనే ‘మన శాండ్’ యాప్ ద్వారా లక్ష ట్రక్కుల ఇసుకను బ్లాక్ చేసినట్టు పోలీసులకు ఆధారాలు దొరికాయని తెలుస్తోంది.
ఈ ఇసుక ఎక్కడికి చేరిందో, ఎవరి కోసం బుక్ చేశారో అన్న వివరాలు స్పష్టంగా లేవని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. ఇకపోతే ఇష్టారాజ్యంగా ప్రజల సమాచారాన్ని టీడీపీ వ్రభుత్వంలో సేకరించిన ఈ సంస్థ గత ఆరునెలలుగా ఏయే కార్యకలాపాలు నిర్వహించిందనే దానిపై కూడా విశ్లేషిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలోని నదీతీరం వెంబడి టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాన ఇసుక ర్యాంపులు బ్లూఫ్రాగ్ నిర్వహణలోనే ఉండేవని తెలుస్తోంది.
ఇదే కాకుండా బ్లూ ఫ్రాగ్ సంస్ద రాష్ట్రంలోని అన్ని ఇసుక ర్యాంపుల్లో పనిచేసే కాంట్రాక్టు సిబ్బందిని కూడా సరఫరా చేసేదని సమాచారం. ఇలాంటి దశలో ఒక ఏడాదిలో రూ.6 కోట్ల జీఎస్టీ చెల్లించిన వైనంపైనా సీఐడీ పోలీసులు ఆరా తీస్తున్నారు. 2018 సెప్టెంబర్ నుంచి 2019 జనవరి వరకు జీఎస్టీ చెల్లింపులో జాప్యంపై రూ. 1.5 కోట్ల జరిమానా కూడా చెల్లించినట్టు వెల్లడైంది.
ఇకపోతే బ్లూ ఫ్రాగ్కు చెందిన 14 సర్వర్ల సమాచారాన్ని క్రోఢీకరిస్తున్నారు. సర్వర్లలో సమాచారం ఎక్కువగా ఉండటంతో విశ్లేషణకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. సీజ్ చేసిన సమాచారాన్ని పరిశీలన నిమిత్తం ఎప్పటికప్పుడు సైబర్ క్రైంకు పంపిస్తున్నారు. అంతే కాకుండా గత మూడేళ్లలో బ్లూ ఫ్రాగ్ నిర్వహించిన మన శాండ్ అప్లికేషన్ను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇకపోతే దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు విషయాలు వెల్లడవుతాయి అని అధికారులు చెబుతున్నారు..