ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. జోరు పెరుగుతోంది. వైసీపీ నేతలు ఏకంగా చంద్రబాబును ఓ సెక్స్ బాబాతో పోలుస్తూ విమర్శలు చేశారు. ఉత్తరాదిలోని డేరాబాబాకు, చంద్రబాబుకు తేడా లేదని, ఇసుక బకాసురులకు రారాజు చంద్రబాబు నాయుడు. ఇసుక దోచుకున్న చంద్రబాబే రాజకీయ లబ్ధికోసం దొంగ దీక్ష చేస్తుంటే ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి విమర్శించారు.


సంక్షోభాలను అవకాశంగా మలుచుకోవడమే కాకుండా.. సంక్షోభాలు సృష్టించి దాని నుంచి లబ్ధిపొందాలని చూస్తున్నాడన్నారు. రాజకీయ లబ్ధి కోసం, తాను, తన కుమారుడి ఉనికి కాపాడుకోవడం కోసం చంద్రబాబు దీక్ష చేస్తున్నాడని పార్థసారథి అన్నారు. అన్యాయంగా విభజించిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రాష్ట్ర, రాజధాని అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా ఆ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని వేల కోట్ల రూపాయలను దోచుకున్నాడని ఎమ్మెల్యే పార్థసారధి మండిపడ్డారు.


వరదల కారణంగా ఇసుక కొరత, ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. ప్రస్తుతం వారం రోజులుగా ఇసుక సమస్య తీరిందన్నారు. ఇసుక లభ్యత ఉన్నా.. దరఖాస్తు చేసుకున్న వారికి అందకుండా చంద్రబాబు బ్లూ ప్రాగ్‌ కంపెనీతో ప్రభుత్వ శాండ్‌ వెబ్‌సైట్‌ను హ్యాకింగ్‌ చేయించాడన్నారు. కొందరు వ్యక్తులు ఫిర్యాదుతో సీఐడీ అధికారులు విచారణ చేయగా.. వాస్తవం తెలిసిందని పార్థసారథి అన్నారు.


బ్లూ ప్రాగ్‌ కంపెనీ యాజమాని చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని, గతంలో ప్రభుత్వ డేటాను చోరీ చేసిన ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ, బ్లూ ప్రాగ్‌ కంపెనీ రెండు కవల పిల్లలు అని స్పష్టంగా తేలిందన్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌ను హ్యాకింగ్‌ చేసి ఇసుక ఉన్నా.. లేనట్లుగా సృష్టించిన చంద్రబాబు కంటే నీచమైన నాయకుడు దేశంలో లేడన్నారు. హ్యాకింగ్‌ ద్వారా ఇసుక లేదని ప్రజల్లో దురభిప్రాయాన్ని కల్పించేందుకు ప్రయత్నించి.. మరోపక్క భవన నిర్మాణ కార్మికుల కోసం తాపత్రయపడుతున్నట్లు చంద్రబాబు దొంగ దీక్ష చేస్తున్నాడని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: