ఈరోజు సాయంత్రం శబరిమల ఆలయం తెరచుకోనుంది. ప్రభుత్వం ఇప్పటికే ఇక్కడ భారీగా పోలీసులను మోహరించింది. రేపటి నుండి అయ్యప్ప దర్శనానికి అనుమతి ఇవ్వటంతో ఐదుగురు మహిళలు శబరిమలలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పంబ దగ్గర ఐదుగురు మహిళల్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఆ మహిళలకు 10సంవత్సరాల వయస్సు నుండి 50 సంవత్సరాల వయస్సు మహిళలకు అనుమతి లేదని సూచించారు. 
 
ఐదుగురు మహిళలని పోలీసులు వెనక్కి పంపించారు. కేరళ ప్రభుత్వం ఇప్పటికే అయ్యప్ప దర్శనానికి వచ్చే మహిళలకు రక్షణ కల్పించలేమని చెప్పిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు గతంలో మహిళలు ఆలయంలోకి ప్రవేశించవచ్చని ఉత్తర్వులు ఇవ్వటంతో ఆలయం దగ్గర ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ప్రభుత్వం పది వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. 
 
కేరళ దేవాదాయశాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ మహిళలు కోర్టు ఉత్తర్వులతో వస్తే భద్రత కల్పిస్తామని చెప్పారు. తృప్తి దేశాయ్ లాంటి సామాజిక కార్యకర్తలు ఇక్కడ బలప్రదర్శన చేయకూడదని సురేంద్రన్ అన్నారు. ఆందోళనలు చేపట్టే ప్రాంతం శబరిమల ఆలయం కాదని సురేంద్రన్ అన్నారు. సంచలనం కోసం ప్రయత్నించే వ్యక్తులకు, నేతల అత్యుత్సాహానికి మీడియా ప్రతినిధులు సహకరించరాదని సురేంద్రన్ కోరారు. 
 
పూణేకు చెందిన మహిళా హక్కుల కార్యకర్త గత సంవత్సరం సుప్రీం తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టింది. ఈ నెల 20వ తేదీ తరువాత శబరిమల ఆలయం సందర్శిస్తానని తృప్తి దేశాయ్ చెబుతున్నారు. ప్రభుత్వం భద్రత కల్పించినా కల్పించకపోయినా ఆలయం సందర్శిస్తానని తృప్తి దేశాయ్ చెబుతున్నారు. దేవస్థానం బోర్డు అధ్యక్షుడు వాసు మాత్రం ఆలయంలోకి మహిళల ప్రవేశం గురించి న్యాయ సలహా తీసుకుంటామని చెబుతున్నారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కొనసాగుతోన్న వివాదం ఈనాటిది కాదు. మహిళల హక్కులకు, భక్తుల విశ్వాసాలకు, ప్రభుత్వ నిర్ణయాలకు, కోర్టు నిర్ణయాలకు మధ్య ఈ వివాదం ఏళ్లుగా నలుగుతోంది. 


 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: