జనసేన అధ్యక్షుడు
పవన్ కళ్యాణ్ రెండు రోజుల
ఢిల్లీ పర్యటన ఎంత ఆసక్తిని రేకెత్తించిందో...అంతే చప్పగా ముగిసిందనే ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజులుగా
వైసీపీ అనుసరిస్తున్న విధివిధానాలను కమలం పెద్దలకు వివరించడానికి,
ప్రధాని మోదీని కలవడానికి వెళ్లారని వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి సమావేశాలేవీ లేకుండానే...జనసేనాని తన పర్యటన ముగించుకుని శనివారం సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. హస్తినలో
పవన్ ఎక్కడ ఉన్నారు..? ఎవర్ని కలిశారు.? రాజకీయ సంబంధమైన అంశాల్లో వెళ్లారా లేదా వ్యక్తిగత పని మీద వెళ్ళారా.? అనేది కూడా పూర్తి గోప్యంగా ఉంచడం...ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
జనసేనా హస్తిన పర్యటన రాజకీయంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నప్పటికీ ఆ పర్యటన గురించి..జనసేన పార్టీ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అదే సమయంలో అసలు ఉద్దేశం ఏంటనేది తెలియజేయలేదు. ఆయన
ఢిల్లీ టూర్ పరిణామాలు...నగరానికి తిరుగు ప్రయాణం సైతం అదే రీతిలో...అస్పష్టంగా ఉంచారు దీంతో...తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితులపై చర్చిస్తారని, వైసీపీపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తారని, ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిని తెలుసుకుంటారని ప్రచారం జరిగింది. ఇలా చర్చలు జరుగుతున్న సమయంలో...పవన్ హస్తిన పర్యటన ముగించుకొని వచ్చేశారు. కాగా, తన
ఢిల్లీ పర్యటనపై
పవన్ కళ్యాణ్ ఆదివారం
ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరోవైపు, జనసేన పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ...ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు
ఢిల్లీ వెళ్లినట్లు తెలిపారు. దీంతో, పవన్ విలేకరుల సమావేశంపై సహజంగానే ఆసక్తి నెలకొంది.
ఇదిలాఉండగా, ఆదివారం నెక్లస్ రోడ్లో జరుగబోయే ‘జార్జ్ రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ వస్తున్నందున పోలీసులు అనుమతి నిరాకరించారు. పవన్ రాకతో ఆయన అభిమానులు, స్టూడెంట్ యూనియన్లు పెద్ద ఎత్తున హాజరయితే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుందని…పోలీసులు పేర్కొన్నారు.