భక్త కనకదాస జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.భక్త కనకదాసు  కురుబ కులస్తుల ఆరాధ్య దైవం. దీంతో అనంతపురం జిల్లా వాసులు, ముఖ్యంగా కురబ కులస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో ఈ ఏడాది జరగబోయే భక్త కనకదాస జయంతి వేడుకలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి . ఇక సీఎం కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడగానే అనంతపురంలోని కనకదాస విగ్రహానికి మంత్రి శంకర్‌ నారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, కురుబ కులస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు  పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ  వేడుక సందర్భంగా మంత్రి శంకర్‌ నారాయణ మాట్లాడుతూ..  కురుబల మనోభావాలను గుర్తించి కనకదాస జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  మంత్రి  శంకర్‌ నారాయణ చంద్రబాబు కురుబలకు ఇచ్చిన అన్ని హామీలను విస్మరించిన విషాయాన్నిగుర్తుచేశారు. చంద్రబాబు బీసీల ద్రోహి అని, కేవలం ఓటు బ్యాంక్‌ కోసం బీసీలను వాడుకున్నారని మంత్రి శంకర్‌ నారాయణ ధ్వజమెత్తారు. 
కాగా ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ గోరంట్ల మాధవ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.  ఎంపీ గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూ ....సీఎం జగన్‌కు కురబ కులస్తులు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. కనకదాస జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. 


అనంతపురం సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ కనకదాస జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జగదీష్‌ మాట్లాడుతూ ...సీఎం జగన్‌ నిర్ణయాన్ని సీపీఐ మనస్పూర్తిగా స్వాగతిస్తోందన్నారు. కనకదాస జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఎన్ని సార్లు విన్నవించినా టీడీపీ అధినేత చంద్రబాబు పట్టించుకోలేదని  విమర్శించారు.  


 కురుబ సంఘం నేతలు వసికేరి లింగమయ్య, రాగే పరశురాం భక్త కనకదాస జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కులస్తుల మనోభావాలను గుర్తించారని, అంతేకాకుండా రాజకీయ ప్రాధాన్యత కల్పించారని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: