ఒక‌రికి మ‌రొక‌రు నీడ‌లా బ‌తకాల‌నుకున్నారు...అది నిజం కాబోద‌ని తెలిసిన మ‌రుక్ష‌ణం...ఇక బ‌త‌కాల‌నుకోలేదు..ఆలోచ‌న వ‌చ్చిందే త‌డువుగా ప్రేమికులిద్ద‌రూ గ్రామం విడిచి పారిపోయారు. అట‌వీలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఉసురు తీసుకున్నారు.. ఈ విషాద ప్రేమికుల బ‌ల‌వ‌న్మ‌ర‌ణం తెలంగాణ‌లోని రాజ‌న్న సిరిసిల్ల జిల్లా క‌థ‌లాపూర్ మండ‌లం రాజారాం తండాలో శ‌నివారం జ‌రిగింది.తండాకు చెందిన భూక్యా బుల్లి-తిరుపతి దంపతుల కూతురు భూక్యా శిరీష(18), అదే గ్రామానికి చెందిన లకావత్‌ సూర్యనాయక్‌- ప్రమీల దంపతుల కుమారుడు లకావత్‌ మహిపాల్‌(18) చిన్న‌త‌నం నుంచే ఒక‌రంటే ఒక‌రు అమితంగా ఇష్ట‌ప‌డేవారు.

వారు పెరుగుతున్న కొద్దీ వారిలో ఒక‌రంటే ఒక‌రిపై ప్రేమ కూడా పెరిగింది. శిరీష ప్రస్తుతం కోరుట్లలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా.. మహిపాల్‌ కరీంనగర్‌లోని ఎస్సాఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చుదువుతున్నాడు.  వీరిద్ద‌రు చ‌నువుగా తిర‌గ‌డం..మాట్లాడుకోవ‌డం చూసిన అమ్మాయి కుటుంబ స‌భ్యులు మ‌హిపాల్‌కు దూరంగా ఉండాల‌ని సూచించారు. దీనికి ఎంత‌గానో నొచ్చుకున్న శిరీష తీవ్ర మ‌నోవేద‌న‌తో ఉండేది.  

ఈ క్ర‌మంలోనే నాలుగునెలలక్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాలకు చెందిన యువకుడితో శిరీషకు నిశ్చితార్థం చేశారు. కొద్దిరోజుల్లో వివాహం నిర్వ‌హించాల‌ని ఇరు కుటుంబాల పెద్ద‌లు నిర్ణ‌యం తీసుకున్నారు.  ఈ విష‌యం తెలుసుకున్న మ‌హిపాల్ ఇటీవలే కరీంనగర్‌ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ముందుగా అనుకున్న ప్ర‌కారం.. శుక్రవారం ఉదయం ప్రేమికులిద్ద‌రూ  గ్రామం నుంచి వెళ్లిపోయారు.శనివారం సాయంత్రం సిరికొండ శివారులోని అటవీప్రాంతంలో ఓ చెట్టుకు ఉరేసుకొని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు.

ఈ విష‌యం తెలిసిన వారంతా అయ్యో పాపం అంటున్నారు. ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెల‌కొంది. క‌న్న‌వాళ్లు క‌న్నీరు మున్నీర‌య్యేలా విల‌పించారు. వారికి న‌చ్చిన‌ట్లు బ‌తక‌నిచ్చిన బాగుండేదంటూ గుండెల‌విసేలా విల‌పించారు. ఏదేమైనా మైనార్టీ తీర‌కుండా పుట్టే ప్రేమ వ‌ల్ల ఎలాంటి అనార్థాలు జ‌రుగుతాయో ?  యువ‌త‌కు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఈ ప్రేమ మారోసారి చాటి చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: