రేపటి నుంచి శీతాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభ నిర్వహణపై  పార్లమెంటు లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరిగింది .  ఈ సమావేశానికి మంత్రులు, పలు పార్టీల ఎంపీలు  హాజరయ్యారు.  ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలన్న ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని ఆయన స్పష్టం చేశారు. గత సమావేశాల్లో ఆర్టికల్ 370 రద్దు, తలాక్‌ బిల్లులను తీసుకువచ్చామని గుర్తు చేశారు. 

తాజా సమావేశాల్లో తమ ఎజెండాను దేశ ప్రజల ముందు ఉంచుతామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. విద్య, వైద్యం, నదులు అనుసంధానంపై ఈ సమావేశాల్లో చర్చిస్తామని ఆయన తెలియజేశారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి నీరు, వైద్యం, విద్య వంటి మౌలిక వసతుల కల్పనే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయంమని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమయంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మరోసారి మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోదని, ప్రభుత్వం మొండి వైఖరి వీడి వారితో చర్చలు జరపాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామని తెలిపారు. 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని బీజేపీ, కాంగ్రెస్‌లు హామీ ఇవ్వలేదని, విభజన చట్టం ప్రకారమే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చామని అన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా అంశాన్ని విభజన బిల్లులో సీఎం కేసీఆర్‌ ఎందుకు పెట్టించలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. 

హైదరాబాద్‌ దేశానికే రెండో రాజధాని కావొచ్చని బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోవడంతో అంబేద్కర్ కోరుకున్నట్టుగా హైదరాబాద్ నగరం రెండో రాజధాని అయ్యే అవకాశాలను తోసిపుచ్చలేమని ఆయన అన్నారు. దీంతో హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతమవుతుందని రాజకీయ ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: