ఒకే ఒక ఘోర ఓటమి
తెలుగుదేశం పార్టీ భవిష్యత్తునే ప్రశ్నార్ధకం చేసేసింది. పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి 2014లో అధికారంలోకి వచ్చి...ఇక అధికారం శాశ్వతం అని భావించిన టీడీపీకి,
2019 ఎన్నికలు చుక్కలు చూపించాయి. పార్టీ చరిత్రలో లేని విధంగా ఘోర ఓటమిని మూటగట్టుకుని 23 సీట్లుకు పరిమితమైంది. అయితే ఇదే ఓటమి నేతల్లో భయం పెరిగేలా చేసింది. అసలు పార్టీని నమ్ముకుంటే మనకు భవిష్యత్తు ఉంటుందా ? లేదా ? అని ప్రతి ఒక్కరు డిఫెన్స్లో పడిపోయారు. చివరకు ఎవరికి వారు ఇష్టమొచ్చినట్టు జంప్ చేసేస్తున్నారు.
చంద్రబాబుకు వయసు మీద పడటం, తనయుడు లోకేశ్ అసమర్ధుడు కావడంతో టీడీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని భావిస్తున్న నేతలు జంప్ అయిపోతున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు
బీజేపీ, వైసీపీల్లోకి జంప్ అయిపోయారు. ఇక తాజాగా ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడటానికి సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ
వల్లభనేని వంశీ దుకాణం సర్దేయగా, గంటా శ్రీనివాసరావు లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఓడిపోయిన నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా జెండా మార్చేయడానికి చూస్తున్నారని తెలుస్తోంది. ఇందులో మొదట 2014 తర్వాత
వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచి టీడీపీలోకి వచ్చిన వారు ముందు వరుస లో ఉన్నారు.
విజయవాడ వెస్ట్ మాజీ
ఎమ్మెల్యే జలీల్ ఖాన్, పాడేరు-గిడ్డి ఈశ్వరి, రంపచోడవరం-వంతల రాజేశ్వరి, అరకు-కిడారి
శ్రవణ్ కుమార్ లు వైసీపీలోకి వెళ్లిపోతారని ప్రచారం జరుగుతుంది.
ఇక వీరితో పాటు శృంగవరపుకోట మాజీ
ఎమ్మెల్యే కోళ్ళ లలిత, యలమంచిలి మాజీ
ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ లు వేరే పార్టీ ల్లోకి వెళ్లడానికి రంగం సిద్ధంగా చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే గుడివాడలో పోటీ చేసి ఓడిపోయిన
దేవినేని అవినాష్, అలాగే మాజీ ఎమ్మెల్యేలు
తోట త్రిమూర్తులు, వరుపుల
రాజా, వరదాపురం సూరిలు టీడీపీకి హ్యాండ్ ఇచ్చేశారు. వీరేగాక చాలామంది సీనియర్ నేతలు, ద్వితీయశ్రేణి నాయకులు టీడీపీని వీడారు.