హోళీ, సంక్రాంతి సహా పలు పండగల టైంలో పిడకలకు గిరాకి ఉంటుంది. అయితే, ఇటీవల పిడకల వ్యాపారం ఆన్లైన్లోకి చేరింది.ఈ-కామర్స్ సైట్లు ఫ్లిప్కార్ట్, అమెజాన్లలో ఆవు పేడతో చేసిన పిడకలను అమ్మడం చూసే ఉంటారు. అలాగే ఇప్పుడు సముద్రాలు దాటి విదేశాలకు ఈ వ్యాపారం చేరింది. అమెరికాలోని గ్రాసరీ (కిరాణా) స్టోర్స్లో వీటి సేల్స్ షురూ అయ్యాయి. పది పిడకలకు 2.99 డాలర్ల (సుమారు రూ.215) రేటు కట్టి అమ్ముతున్నారు. ఈ అమ్మకం న్యూస్, సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అయింది.
న్యూజెర్సీలోని ఎడిసన్లో ఉన్న ఓ కిరాణ స్టోర్లో పిడకలు అమ్ముతున్నట్లు సమర్ హలామ్కర్ అనే ఎన్నారై ట్వీట్ చేశాడు. తన కజిన్ వాటి ఫొటోను తనకు పంపాడని తెలిపాడు.ఆ ప్యాకెట్పై ఓ కామెంట్ ఉందని చెప్పారు. ‘కౌ డంగ్ కేక్స్.. తినడానికి కాదు. ఇవి పండుగలు, సంప్రదాయ అవసరాల్లో పనికొచ్చేవి’ అని ఆ ప్యాక్పై రాసి ఉందని తెలిపాడు. అయితే ఆ ప్యాకెట్ చూసిన సమర్కు ఓ వింత డౌట్ వచ్చింది. దేశీ ఆవు పేడతో చేసిన పిడకలనే ఇండియా నుంచి దిగుమతి చేశారా? లేక అమెరికా ఆవులతో చేసినవా? అంటూ ట్విట్టర్లో అడిగాడు. దీనిపై చాలా మంది దేశీ అవు పిడకలే అంటూ కామెంట్లు చేశారు. కొందరు పంచ్లు కూడా వేశారు.
ఓ నెటిజన్ మాత్రం టేస్ట్ చేసి చూడు అంటూ సెటైర్ వేశాడు. ఇలాంటి డౌట్లు వస్తాయని ముందే అనుకున్నారేమో. ఇండియా నుంచి వచ్చిన ఉత్పత్తి అని తెలుపుతూ “Product of India” అని దానిపై ప్రింట్ చేసి ఉంది. మొత్తంగా ఇలా విదేశాలకు చేరిన దేశీ ఆవు పిడకల వ్యాపారం నెట్టింట హల్చల్ చేస్తోంది.