తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అంటుంది బీజేపీ... ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవటం దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవటంలో ముందుంటూ రాష్ట్రంలో బలపడేందుకు అవకాశమున్న అన్నీ ప్రయత్నాలు చేస్తుంది.  అయితే ప్రతి అవకాశాన్ని అంది పుచ్చుకోవటంలో కాంగ్రెస్ కంటే వేగంగా స్పందిస్తూ ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా కూడ గట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

 

తెలంగాణాలో ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఆర్టీసీ సమ్మె. దాని విషయంలో తొలినుంచి కార్మికులకు తోడుగా ఉంటూ వస్తున్నారు కమలనాథులు. అంతే కాదు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  ఒకవిధం గా చెప్పాలంటే ఆర్టీసీ సమ్మెను తమకు అనుకూలంగా మలుచుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

 

అందుకే, ఒకవైపు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఆందోళనలు ఉధృతం చేస్తూనే, మరోవైపు కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ బలహీనతలను సొమ్ము చేసుకునే ప్రయత్నంలో దూసుకెళుతూ ప్రభుత్వాన్ని ఒక రకంగా చక్రభంధం లో ఇరికించేస్తుంది బీజేపీ.

 

ఇటీవల ఆర్టీసీ నష్టాలపై టీ-బీజేపీ అధ్యక్షుడు ప్రొ. డా. కె  లక్ష్మణ్ కేంద్రానికి లేఖ రాయడం కలకలం రేపుతోంది. అసలు, ఆర్టీసీ నష్టాలకు యూనియన్లు, కార్మికులే కారణమని కేసీఆర్ ప్రభుత్వం చెబుతుంటే, టీఆర్ఎస్ ప్రభుత్వ విధానం వైఖరివల్లే ఆర్టీసీ ఋణాల  ఊబిలో కూరుకుపోయేలా చేసిందని లక్ష్మణ్ ఆరోపిస్తున్నారు.

 

నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆర్టీసీ ఉద్యోగులు సంఘటితంగా ప్రయత్నిస్తుంటే, ఆ ప్రయత్నాలకు ప్రభుత్వ అధినేత కేసీఆర్ స్వయంగా అడ్డుకున్నారని లక్ష్మణ్ అంటున్నారు. అసలు, ఆర్టీసీ పెట్రోల్ బంకుల్ని, ఇతరులకు అప్పగించడం వెనుక అతి పెద్ద కుంభకోణం ఉందంటూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్‌కు, లక్ష్మణ్ లేఖ రాయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

 

అసలు, ఆర్టీసీ నష్టాలకు టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటోన్న లక్ష్మణ్‌, కేంద్రం కేటాయించిన పెట్రోల్ బంకులను బయట వ్యక్తులకు కట్టబెట్టి “ఎంవోయూ”లను అతిక్రమించారని ఆరోపించారు.

 

హెచ్‌పీసీఎల్‌, ఐవోసీతో ఆర్టీసీ చేసుకున్న ఒప్పందాల్లో తీవ్రమైన ఉల్లంఘనలు జరిగాయంటోన్న లక్ష్మణ్ వాటిని రద్దు చేయాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని కోరారు. ఆర్టీసీ సంస్థ భూముల్ని, విలువైన ఆస్తుల్ని, బంకులను నచ్చినవారికి తన పార్టీ వ్యక్తులకో తమకు ప్రయోజనం అందించే వారికో కట్టబెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు సంస్థకు నష్టాలు వస్తున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

 

ఆర్టీసీకి చెందిన పెట్రోలు బంకుల్ని ఇతరులకు అప్పగించడం వల్ల, ఆర్టీసీకి రావాల్సిన కమీషన్‌లో 60 శాతం ప్రైవేట్‌ వ్యక్తులకు అందుతూ సంస్థ నష్టపోతోందని ఆరోపించారు. ఆర్టీసి భూములను ఆయిల్ కంపెనీలకు లీజుకిచ్చి లబ్ది పొందాలని ఆర్టీసీ భావిస్తే, దానికి కేసీఆర్ ప్రభుత్వం గండి కొట్టిందని లక్ష్మణ్ మండిపడ్డారు.

 

ఆర్టీసీకి కేంద్రం కేటాయించిన పెట్రోల్ బంకులను ప్రభుత్వేతర వ్యక్తులకు సంస్థలకు కట్ట బెట్టడం వెనుక, భారీ కుంభకోణమే ఉండి ఉండొచ్చంటూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తన లేఖ ద్వారా తెచ్చారు లక్ష్మణ్‌. అందుకే, ఆర్టీసీకి, ఆయిల్ కంపెనీల మధ్య జరిగిన ఒప్పందాలను బయటపెట్టి, విచారణ జరపాలని కోరారు. మొత్తానికి ఆర్టీసీ పెట్రోల్ బంకులను ప్రభుత్వం ఇతరులకు కట్టబెట్టడం దారుణమైన నిబంధనల ఉల్లంఘన అంటున్నారు టి-బిజేపి అధ్యక్షుడు లక్ష్మణ్ - ఆ డీలర్-షిప్పులను రద్దుచేసి, వాటిని ఆర్టీసీయే నిర్వహించుకునేలా ఆదేశించాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు లక్ష్మణ్‌.  దానిపై కేంద్ర ప్రభుత్వం స్పందన కోసం నిరీక్షించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: