భారత దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రతిరోజూ కొన్ని లక్షల కోట్ల వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతూ ఉంటాయి. నేషనల్ ట్రేడ్ సెంటర్ గా ఉన్న ముంబైలో పైకి ఎన్ని కోట్ల బిజినెస్ జరుగుతుందో కనిపించే లెక్కలు చాలానే ఉంటాయి. అయితే అదే టైంలో ముంబైలో మాఫియా హడావుడి ఏ రేంజ్లో ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇదే ముంబైలో పైకి కనపడకుండా చాలా క్రైం జరుగుతోంది. ఎవరికి వారు గజిబిజీ జీవితంలో పడిపోయి ముంబైలో జరిగే క్రైమ్ గురించి పట్టించుకోవడం లేదు. అయితే తాజాగా వెలువడిన క్రైం నివేదికలు చూస్తే గుండె గుభేల్ మంది.
ప్రతిరోజు ముంబైలో సరాసరి లెక్కల ప్రకారం నలుగురు అమ్మాయిలు కనిపించకుండా మాయమైపోతున్నారట. వీరిలో 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉన్న అమ్మాయిలు ఉండగా వీరిలో ఎక్కువ మంది 15 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న బాలికలు ఉన్నట్టు తెలుస్తోంది. పదో తరగతి, ఇంటర్ చదువుతున్న బాలికలు ఉండడంతో ముంబై పోలీసులకు ఈ సమస్య పెద్ద సవాలుగా మారింది. ముంబై నగరంలో మైనర్ బాలికలు అపహరణకు గురవుతుండడం ఇటు పోలీసు వర్గాలను... అటు పిల్లల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు కారణం అవుతోంది.
తాజా లెక్కలు చూస్తే ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు 10 నెలల్లో ఏకంగా 1141 మైనర్ బాలికలు అపహరణకు గురైనట్లు వివిధ పోలీసు స్టేషన్ల లో కేసులు నమోదయ్యాయి. అందులో 912 కేసులను పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేధించారు. పోలీసుల విచారణలో ఎక్కువ మంది ప్రేమలు, పెళ్లిళ్ల పేరుతో మోసానికి గురైన వారే అని తెలుస్తోంది. పెళ్లి పేరట మోసపోయిన అమ్మాయి కేసులే అధికంగా వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు కూడా చెపుతున్నారు.
ఇలా అపరహరణకు గురైన అమ్మాయిల్లో చాలా మంది అమ్మాయిల తల్లిదండ్రులు తమ కుటుంబాల పరువు ఎక్కడ పోతుందో ? అని పోలీసులకు చెప్పడం లేదు. దీంతో కొన్ని కేసులు పోలీసుల రికార్డుల్లో నమోదు కూడా కావడం లేదు. మోసపోయిన వారిలో అధికంగా కాలేజీల కు వెళ్లే బాలికలే ఉన్నారు. పదో తరగతి, ఇంటర్ చదువుతున్న వయస్సులోనే వీరు సినిమాలు, సోషల్ మీడియాల ప్రభావంతో ప్రేమలో పడి అన్ని సమర్పించుకన్నాక కాని.. వారు మోసపోయామని తెలియడం లేదు.