ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ వస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇప్పుడు మరో హామీ వంతు వచ్చింది. అదే మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు వైఎస్సార్‌ భరోసాను అమలు చేయబోతుంది. ఏడాదికి పది నెలలు మత్స్యకారులకు చేపల వేట ఉంటుంది. రెండు నెలల పాటు నిషేధ కాలంలో వారికి ఉపాధి దొరకదు.

 

ఈ రెండు నెలలు గత ప్రభుత్వం నెలకు రూ.2వేల చొప్పున రూ.4 వేలు ఆర్థిక సాయం చేసేది. అయితే వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ సాయాన్ని పెంచారు. నెలకు రూ.5 వేల చొప్పున రెండు నెలలకు సంబంధించిన రూ.10 వేల సాయాన్ని వైయస్‌ఆర్‌ భరోసాగా నామకరణం చేశారు. ఇవాళ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈ పథకానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శ్రీకారం చుడుతున్నారు.

 

గతంలో యాంత్రిక పడవలు, మరపడవలకు నిషేధ కాలభృతి అమల్లో ఉంది. ఈ ఏడాది నుంచి తెప్పలకు కూడా దీనిని విస్తరింప చేశారు. సీఎం జగన్‌ పాదయాత్ర సందర్భంగా మత్స్యకారులకు ఇచ్చిన హామీ నెరవేరుతుండటంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆటుపోట్లకు ఎదురీదుతూ వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను సైతం లెక్క చేయక చేపల వేటే ఆధారంగా జీవనం గడిపే మత్స్యకారులకు జగన్ నిర్ణయంతో మంచి రోజులొచ్చాయి.

 

ఏ పొద్దుకాపొద్దు వేట చేసి తీసుకువచ్చే మత్స్య సంపదను అమ్మితే గానీ బతుకు నడవని మత్స్యకారుల ఆకలి కేకలు గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పట్టీపట్టనట్లుగా ఉండటంతో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తోచని స్థితిలో ఉండేవారు. వేట నిషేధ కాల భృతి సకాలంలో ఇవ్వకపోవడంతో అప్పులతో జీవనం సాగిస్తూ బతుకు నావను దుర్భరంగా నెట్టుకొచ్చేవారు. ఇక ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలగినట్టే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: