ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిష్టాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రజల్లోకి వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో రచ్చబండ ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రభుత్వ పథకాల అమలుపై లబ్దిదారులను జగన్ నేరుగా కలువనున్నారు. తొలి రచ్చబండ కార్యక్రమం కడప, చిత్తూరు , శ్రీకాకుళం జిల్లాలో ఉండే అవకాశముంది. జగన్ ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని భావిస్తున్నారు. త్వరలో రచ్చబండ ప్రణాళికలు సిద్ధం కానున్నాయి.
రచ్చబండలో భాగంగా ప్రతివారం ఒక జిల్లా పర్యటించనున్నారు. మరో వైపు జనవరి లేదా ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రణాళికలు చేస్తున్నారు. అయితే ఈ రచ్చబండ కార్యక్రమం గుర్తుకు రాగానే వెంటనే మనకు స్పురించే నేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ రచ్చబండ కార్యక్రమంలో ప్రభుత్వ పనితీరును.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలు చేరుతున్న తీరును తెలుసుకోవడం.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై ప్రజల స్పందన ఎలా ఉంది..అధికారుల పనితీరు ఎలా ఉంది.. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎలా వ్యవహరిస్తున్నారు.. ప్రజలు పడుతున్న ఇబ్బందులను రచ్చబండ వద్దనే తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించేందుకు ఈ మహాత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అయితే వైఎస్ రచ్చబండకు ఆకాశ మార్గంలో వెళుతూనే హెలికాప్టర్ క్రాష్ కావడంతో అనంతలోకాలకు వెళ్ళిపోయారు వైఎస్. ఆయన మరణం ఏపీకి తీరని లోటును మిగల్చింది. అయితే ఆనాడు తండ్రి చూపిన మార్గంలో నడుస్తున్న తనయుడు ఏపీ సీఎం జగన్ ఏపీలో రచ్చబండకు శ్రీకారం చుడుతున్నారు. ఆనాటి తండ్రి ఆశయాలను ఈనాడు తనయుడిగా వాటిని కొనసాగిస్తూ.. రాజన్న పాలనను ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు.
ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న పరిపాలనను బేరిజు వేసుకునేందుకు జగన్ సమాయత్తం అయ్యారు. అందుకే రాబోవు ఏడాది అంతా ప్రజల నడమ ప్రజల కోసం పని చేసేందుకు రచ్చబండకు శ్రీకారం చుడుతున్నారు. ఈ రచ్చబండ కార్యక్రమం సక్సెస్ అయితే ఇక ఏపీలో ప్రతిపక్షాలకు నూకలు చెల్లినట్లే.