ఆంధ్రజ్యోతి మీడియా వైఎస్ జగన్ కు వ్యతిరేకమన్న సంగతి బహిరంగ రహస్యమే. ఇప్పుడే కాదు వైఎస్ హయాం నుంచి ఆంధ్రజ్యోతి మీడియాకు వైఎస్ కుటుంబానికి గొడవ ఉంది. వైఎస్ హయాంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. చాలా సవాళ్లు విసిరారు. ఆ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించారు. ఇప్పుడు జగన్ సీఎం అయిన నేపథ్యంలో ఆంధ్రజ్యోతి కలం మరింతగా పదునెక్కుతోంది.

 

ప్రత్యేకించి ఇంగ్లీష్ మీడియం చదువులపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ఇస్తోంది. ఏకంగా ఇది మత వ్యాప్తి కోసం జగన్ చేస్తున్న పని అనే అభిప్రాయం కలిగేలా కథనాలు వస్తున్నాయి. దీనిపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఆంధ్రజ్యోతి అధినేత ఏ స్టేజీ నుంచి ఏ స్టేజీకి ఎదిగారో..ఎవరికి బినామీగా ఉన్నారో ప్రజలందరికీ తెలుసని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. రాధాకృష్ణ రాతలు దారుణంగా ఉన్నాయని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు.

 

పేదల పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం చదువుకునేందుకు వైయస్‌ జగన్‌ అవకాశం కల్పించారని, చంద్రబాబు పార్ట్‌నర్‌ పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబు డైరెక్షన్లో పని చేస్తున్నారని, అసలు ఆయన జ్ఞానినో, అజ్ఞానినో తేల్చుకోవాలన్నారు. పెయిడ్‌ ఆర్టిస్టులతో చంద్రబాబు డ్రామాలాడిస్తున్నారని, అవాక్కులు, చవాక్కులు మానుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున హెచ్చరించారు.

 

ఎస్సీ, ఎస్టీల పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకోవద్దా అని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ప్రశ్నించారు. పేదల అభ్యున్నతి కోసం సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేద పిల్లలు ఇంగ్లీష్‌ విద్య చదువుకోవడానికి వీలు లేదా అని, ఈ విషయాన్ని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలు ఇంగ్లీష్‌ చదువులు చదువుకోవద్దని బహిరంగంగా చెబుతారా అని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున సవాల్ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: