శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మహిళ దారుణ హత్య చోటు చేసుకుంది. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ మరనం సంఘటన మరువకముందే...అదే శంషాబాద్ పరిధిలో మరో కలకలం చోటు చేసుకుంది. శంషాబాద్ను ఆనుకొని ఉన్న సిద్ధుల గుట్ట సమీపంలో అమానుష ఘటన జరిగింది. గుర్తు తెలియని దుండగులు మహిళను హత్య చేసి కాల్చి వేసినట్లు గుర్తించారు. ఆ మహిళకు 35 సంవత్సరాల వయసు ఉంటుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. ప్రియాంకరెడ్డి హత్య గురించి కమిషనర్ సజ్జనార్ వివరాలు వెలువరించిన స్వల్పవ్యవధిలోనే ఈ ఘటన తెరమీదకు రావడం గమనార్హం.
కాగా, ఇంటి నుంచి బయల్దేరి గచ్చిబౌలికి ట్రీట్మెంట్కు వెళ్లడం, తిరుగు ప్రయాణంలో టోల్ప్లాజా వద్దకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలే..ప్రియాంకరెడ్డి హత్యలో కీలకంగా మారాయని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రియాంక ట్రీట్మెంట్కు వెళ్తున్న సమయంలో... ప్రియాంక బైక్ పార్క్ చేస్తున్న సమయంలో నిందితులు అక్కడే ఉన్నారని తెలిపారు. ప్రియాంక బైక్ని నవీన్ పంక్చర్ చేశాడని.. శివ అనే వ్యక్తి.. దగ్గరలో మెకానిక్ షాపు ఉంటే తీసుకెళ్తానంటూ చెప్పడంతో ఆమె నమ్మిందని ఇదే అదునుగా భావించిన మహ్మద్ ఆరీఫ్.. ప్రియాంకను లాక్కెళ్లి మద్యం తాగించి అత్యాచారం చేశాడని పేర్కొన్నారు. నవీన్, చెన్నా కూడా ఆరీఫ్కు సహకరించారు. అంతలోనే శివ కూడా అక్కడకు వచ్చాడు. వీళ్లంతా కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. రేప్ చేసే సమయంలో మొఖాన్ని అంతా మూయడంతో ఊపిరాడక అక్కడే చనిపోయింది. మృతదేహంతో ఆరీఫ్, చెన్నా లారీలో కదలగా శివ, నవీన్ టూ వీలర్ నడిపించుకుంటూ వెళ్లారు. చెటాన్ పల్లి సమీపంలో ఆమెపై పెట్రోల్ పోసి తగులబెట్టి.. మళ్లీ మృత దేహం కాలిందా లేదా అంటూ.. వెనక్కి వచ్చి చెక్ చేసుకున్నారని సీపీ సజ్జనార్ వివరించారు.
కాగా, తాజా ఉదంతంలో మహిళ సైతం దారుణంగా కాల్చివేయబడి ఉండటం, అందులోనూ అదే శంషాబాద్ పరిధిలో కావడం చర్చనీయాంశంగా మారింది.ప్రియాంకరెడ్డి ఘటన మరవకముందే మరో ఘటన కలకలం రేపుతోంది. పోలీసులకు ఈ కేసు దర్యాప్తు కత్తిమీద సాముగా మారింది.