వైఎస్ జగన్ సీఎంగా ఆరు నెలల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ తక్కువ సమయంలోనే జగన్ అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. వీటిలో ఎక్కువ భాగం తన తండ్రి వైఎస్ ఆర్ పేరుపైనే రూపొందించారు. తన మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేయడమే లక్ష్యంగా జగన్ పాలన సాగిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రగానే ఉన్నా.. తాను ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉండేందుకే జగన్ మొగ్గు చూపుతున్నారు.

 

అయితే జగన్ పాలన పట్ల సహజంగానే విపక్షం కారాలు మిరియాలు నూరుతోంది. జగన్ ఆరు నెలల పాలనలో సాధించింది శూన్యమని ఆరోపిస్తున్నారు. అందుకే వైసీపీ చంద్రబాబుకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైయ‌స్ఆర్‌ సీపీ క‌ర్నూలు పార్లమెంట్ ఇన్‌ చార్జ్ బి.వై. రామయ్య ఆదివారం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లను చెబితే చాలు.. లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తానన్నారు.

 

 

కర్నూలు జిల్లా అభివృద్ధిని విస్మరించిన చంద్రబాబుకు జిల్లాలో అడుగుపెట్టే ఆర్హత లేదని, విమర్శించారు. జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రిగా ఫెయిలైన చంద్రబాబు ప్రతిపక్షనేతగా కూడా అట్టర్‌ ప్లాప్‌ అయ్యారని ఎద్దేవా చేశారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని మండిపడ్డారు.

 

 

అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేసి, ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం చాతకాక కేవలం విమర్శలకు పరిమితమయ్యాడని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా బుద్ధి రాలేదని, ఇప్పటికైనా అసత్య ఆరోపణలు మానుకోవాలని సూచించారు. మరి ఈ వైసీపీ ఆఫర్ కు టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో.. చూడాలి మరి. చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో ఈ సవాళ్లు ఆసక్తి రేపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: