అత్యాంత దారుణంగా....అమానవీయంగా దిశ విషయంలో వ్యవహరించిన నలుగురు నిందితుల విషయంలో పోలీసులు, జైలు వర్గాలు ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. నలుగురు నిందితులు చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, దిశ అత్యాచారం, హత్యకేసు నిందితుల తీరుతో పోలీసుల్లోనే ఒకరకమైన భయం పుట్టిందనే ప్రచారం జరుగుతోంది. చర్లపల్లి జైలుతో పాటు షాద్నగర్ కోర్టు వద్ద పోలసులు మంగళవారం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిందితుల నుంచి కీలక ఆధారాలను సేకరించాలని కోరుతూ పోలీసులు షాద్నగర్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయగా... నిందితులను కోర్టు పది రోజుల కస్టడీకి అప్పగించింది.
కాగా, తమ విచారణలో సీన్ రీకన్స్ట్రక్షన్తో పాటు మరికొన్ని ఆధారాలు సేకరించాలని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో నిందితులను బుధవారం నుంచి ఈ నెల 12 వరకు కస్టడీకి అనుమతిస్తూ షాద్నగర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీలో బయటపడే వివరాలతో నిందితులపై చార్జిషీట్ ఫైల్ చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, నిందితులపై ప్రజాగ్రహం తీవ్రంగా ఉండడంతో పోలీసులు ఈ కేసులో గోప్యత పాటిచేస్తున్నారు. అంతేకాకుండా పలు జాగ్రత్తలు తీసుకొని చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నలుగురు నిందితులను రహస్యంగా విచారించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
పెద్ద ఎత్తున ప్రజాగ్రహం ఉన్న నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బందోబస్తు ఏర్పాట్లపై సైబరాబాద్, రాచకొండ సీపీలు సజ్జనార్, మహేశ్ భగవత్ఉన్నతాధికారులతో చర్చించారు. నిందితులను ఎక్కడ విచారించాలనే విషయాన్నీ పరిశీలించారు. ఎక్కడికి తరలించినా సమస్యలు తప్పకపోవచ్చనే సందేహంతో నిందితులను జైల్లోనే విచారించే అవకాశాలు ఉపయోగించుకోనున్నట్లు తెలిసింది.ఇప్పటికే నిందితుల ఐడీ పరేడ్ కూడా సీక్రెట్గా పూర్తిచేశారు. మరోవైపు, నలుగురు నిందితులు కలిస్తే కేసును తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని విడివిడిగా విచారించడం వల్ల ప్రాసిక్యూషన్కు బలమైన సాక్ష్యాలు దొరుకుతాయని భావిస్తున్నారు. అందుకే, జైలులో నిందితులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా నలుగురినీ వేర్వేరు బ్యారెక్లలో ఉంచారు.