దిశా నిందితులపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. నిందితులను వెంటనే బహిరంగంగా ఉరితీయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ఇటు నిందితులను ఉంచిన షాద్నగర్ పోలీస్స్టేషన్లో మరోవైపు చర్లపల్లి జైలు వద్ద సైతం ఆందోళనలు జరిగాయి. పెద్ద ఎత్తున వచ్చిన ప్రజానికానికి పోలీసులు సర్దిచెప్పలేని స్థితి ఎదురైంది. ఇంకా చెప్పాలంటే...వారిపై లాఠీచార్జీ జరిగింది. ఇప్పటికీ...అందరి నోటా ఒకటే మాట..నిందితులకు ఉరి వేయాలని. అయితే, ఓ పోలీస్ ఉన్నతాధికారి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సి ఆంజనేయరెడ్డి ప్రజలు కోరినంత మాత్రానా ఉరి తీసేస్తారా? అలా చేస్తే...చట్టం, న్యాయం సంగతి ఏంటి అని ప్రశ్నించారు.
మహిళలకు రక్షణ-సవాళ్లు (దిశా-నిర్దేశం) అనే అంశంపై హైదరాబాద్లోని మఖ్దూంభవన్లో సదస్సు జరిగింది. సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి అధ్యక్షత వహించిన ఈ సదస్సుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సి ఆంజనేయరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ... తీర్పులు ఆలస్యమైతే కోర్టుల పట్ల భయం పోతుందని అన్నారు. నేరాలు, హత్యలు, లైంగికదాడులకు సంబంధించిన కేసులపై సత్వర తీర్పులు వస్తేనే సమాజంలో కోర్టులపై నమ్మకం పెరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సి ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ లైంగికదాడులకు పాల్పడిన నిందితులను చంపడం, ఉరితీయడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. దిశ కేసులో నిందితులను ఉరితీయాని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయని అయితే, చట్టం-న్యాయం వంటివి అమల్లో ఉన్న తరుణంలో...ఇలాంటి డిమాండ్లు ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. హత్యకేసుల్లో ఉరిశిక్ష ఉన్నా నేరాలు జరుగుతూనే ఉన్నాయని వివరించారు. జాతీయ రహదారుల్లో మద్యం విక్రయాలు లైంగికదాడులకు ఓ కారణమన్నారు. ప్రతి పోలీస్స్టేషన్లోనూ మహిళా విభాగం ఏర్పాటు చేయాలని కోరారు.