మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే పరిపాలన అనుభవ లోపం ఆదిలోనే బయటపడింది. ఉత్కంఠ పరిణామాల మధ్య రాజకీయంగా బద్ధ శత్రువులైన కాంగ్రెస్-ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి...మిత్రపక్షమైన బీజేపీకి దూరమైన ఉద్దవ్ ఇప్పుడు ఇటు మిత్రపక్షం అటు ప్రతిపక్షానికి దొరికిపోయారు. అధికారిక సమీక్షలో తన సమీప బంధువుకు చోటు కల్పించి విపక్షాలు విమర్శలు చేసే అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా తన మిత్రపక్షంతో కామెంట్లు పడ్డారు.
ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన ముంబైలో అధికారిక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఉద్దవ్ సమీప బంధువు, శివసేన అనుబంధ సంఘం యువసేన కార్యదర్శి వరుణ్ సర్దేశాయ్ పాల్గొన్నారు. సీఎం కొడుకు, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేతో కలిసి పార్టీ యువజన విభాగమైన యువసేన కార్యదర్శి వరుణ్ సర్దేశాయ్ పాల్గొనడం వివాదస్పదమైంది. దీంతో సహజంగా దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించారు. ఈ పరిణామంపై బీజేపీ మహారాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి మాధవ్ భండారీ బుధవారం స్పందిస్తూ..కొత్త ప్రభుత్వం ఒక తప్పుడు సంప్రదాయాన్ని నెలకొల్పింది అని విమర్శించారు. సీఎం కార్యాలయంలో ప్రత్యామ్నాయ అధికార కేంద్రం ఏర్పాటవుతున్నట్లు కనిపిస్తుందని విమర్శించారు.
ఇదిలాఉండగా, ప్రభుత్వ భాగస్వామి అయిన ఎన్సీపీ సైతం ఉద్దవ్ మీటింగ్ను తప్పుపట్టింది. ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మాట్లాడుతూ ``ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఆయనకు పాలనానుభవం లేదు. అయినా ప్పటికీ ఇటువంటి ఘటన పునరావృతం కారాదు`` అని వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా, యువసేన కార్యదర్శి వరుణ్ సర్దేశాయ్ ఈ వివాదంపై స్పందించారు. సమావేశంలో తాను పాల్గొనడానికి పెద్ద ప్రాధాన్యం లేదని కొట్టిపారేసిన సర్దేశాయ్...కావాలనే వివాదం చేస్తున్నారని ఆరోపించారు.కాగా, సీఎం ఉద్దవ్ ఠాక్రేను టార్గెట్ చేసేందుకు అధికారం తృటిలో కోల్పోయిన బీజేపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని...అవకాశాల కోసం ఎదురు చూసే ఆ పార్టీకి ఉద్దవ్, శివసేన సైనికులే చాన్స్ ఇస్తున్నట్లున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.