అప్పుడే పుట్టిన నవజాత శిశువును రక్తం పంచుకొని జన్మనిచ్చిన తల్లి 17వ అంతస్థు నుంచి కిందకు విసిరేసింది. అప్పుడే కళ్లు తెరిచిన ఆ పసికందు అంత ఎత్తునుంచి పడి రక్తం మడుగులో కన్నుమూసింది. ఈ ఘటనలో పోలీసులు ఆ పసికందూ తల్లిని ఆరా తీయగా....దారుణానికి ఒడిగట్టింది తానేనని అంగీకరిస్తూ...ఇందుకు కారణం తన భర్త అని తెలిపింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. ఇంతకీ భర్త ఏం చేశాడని ప్రశ్నిస్తే...తన మొగడు తనని సరిగ్గా చూసుకోవడం లేదని ఆమె సమాధానం ఇచ్చింది. నిందితురాలి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకున్న పోలీసులు భర్తను విచారించేందుకు సిద్ధమయ్యారు.
సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే...ముంబైలోని కందివాలిలోని జైభారత్ సొసైటీ, ఎస్ఆర్ఏ భవనం ఆవరణలో సాయంత్రం 4 గంటల సమయంలో శిశువు చనిపోయినట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రక్తం మడుగులో పడి ఉన్న పసికందును అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా 17వ అంతస్థులో ఉన్న ఓ మహిళ తన బిడ్డను కిందకు విసిరేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆ బిడ్డ ఎవరు? వారి తల్లిదండ్రులు ఎవరు అనే విషయాలు ఆరా తీశారు. ఈ క్రమంలో పసికందు తల్లిని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి.
భార్య- భర్తలైన తమ మధ్య గతకొద్దికాలంగా మనస్పర్ధలు తలెత్తినట్లు ఆ దుర్మార్గులైన తల్లి పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది. బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పిన ఆమె జాగ్రత్తగా చూసుకోవాల్సిన భర్త తమ ఇద్దరినీ పట్టించుకోకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అంగీకరించింది. ఆ పాపిష్టి తల్లి చెప్పిన వివరాల పట్ల షాక్ తిన్న పోలీసులు...మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఆమె భర్తను విచారిస్తున్నారు.