వెటర్నరీ వైద్యురాలు దిశ ఉదంతంలో సంచలనం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం దేశప్రజలంతా సంతోషించే వార్త వెలుగులోకి వచ్చింది. దేశమంతా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దిశ హత్యకేసు దర్యాప్తులో షాద్నగర్ వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన జరిగిన స్థలానికి పోలీసులు నిందితులను తీసుకువెళ్లగా దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాతంలో దిశా అనే వెటర్నరీ డాక్టర్పై నలుగురు దుండగులు ఘోరంగా హత్యాచారం చేశారు. ఈ ఘోర ఘటనపై సమాజంలోని ప్రతి వ్యక్తి స్పందించారు. అఘాయిత్యానికి పాల్పడిన దోషులకు వెంటనే ఉరిశిక్ష వేయాలనీ, నడిరోడ్డుపై వారిని చంపేయాలని వారు తమ ఆక్రోషాన్ని వెల్లగక్కిన విషయం తెలిసిందే. ఏకంగా నిందితులను ఉంచిన చర్లపల్లి జైలు వద్ద ఆందోళన చేపట్టారు. అదే సమయంలో షాద్నగర్ పోలీస్ స్టేషన్ వద్ద సైతం నిరసన వ్యక్తం చేశారు. దీంతో దిశ హత్యాచారం కేసుపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తూ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మహబూబ్నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, దీంతో కేసు దర్యాప్తులో భాగంగా...సీన్ రీకనస్ట్రక్షన్ కోసం నిన్న నిందితులను చటాన్ పల్లిలోని ఘటన జరిగిన స్థలానికి తీసుకువెళ్లారు. దిశ కేసుకు సంబంధించి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, దాంతో నిందితుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో...వారిని శుక్రవారం ఉదయం సంఘటన స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడి నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించడంతో.. చేసేది ఏంలేక పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ కేసులో A1ఆరిఫ్, A2జొల్లు శివ, A3జొల్లు నవీన్, A4చెన్నకేశవులు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. నిందితులను దిశను చంపిన స్థలంలోనే ఎన్కౌంటర్ చేయడం విశేషం. కాగా ఈ ఘటనపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. దిశకు న్యాయం జరగాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగగా తాజాగా పోలీసుల నిర్ణయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తారు.