గత నెల 27న వెటర్నరీ వైద్యురాలు దిశని అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన విషయం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దిశ నిందితులు జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు, ఆరిఫ్లని ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా చటాన్ పల్లి బ్రిడ్జి దగ్గరకి నిందితులని తీసుకెళ్ళి విచారిస్తుండగా, వారు పోలీసులపై దాడి చేసే ప్రయత్నం చేశారట. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం పోలీసులు నలుగురు నిందితులని ఎన్కౌంటర్ చేశారు. అయితే ఈ ఘటనలో సీపీ సజ్జనార్ను తెలుగు ప్రజలు కీర్తిస్తున్నారు.
తెలంగాణలో జరిగిన రెండు దారుణ ఘటనల్లో..సజ్జనార్ సంచలన రీతిలో వ్యవహరించారని అంటున్నారు. వరంగల్లో స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి చేసిన నిందితులపై ప్రజాగ్రహం పెల్లుబికిన తరుణంలో...వారు కొద్దిరోజుల తర్వాత ఎన్కౌంటర్ అయ్యారు. ఈ ఎన్కౌంటర్ సమయంలో వరంగల్ జిల్లా ఎస్పీగా వీసీ సజ్జనార్ ఉన్నారు. స్వప్నిక , ప్రణీలతపై యాసిడ్ దాడికి పాల్పడిన శ్రీనివాస్ వాళ్లకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అలా జిల్లా బాధ్యుడిగా ఉన్న సజ్జనార్ అట్టుడికిపోయిన ఘటనపై తన నాయకత్వంలోని పోలీసులతో ఊహించని తీర్పును ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డికి సైతం ఇబ్బందులు కలిగించని రీతిలో...వ్యవహరించారు.
ఇప్పుడు మళ్లీ అదే సజ్జనార్...సైబరాబాద్ సీపీగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనలో అమ్మాయిపై అఘాయిత్యాలకు పాల్పడిన నిందితులకు పోలీసు భాషలో బుద్దిచెప్పారు. దిశ నిందితులను సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలికి తీసుకెళ్ళగా, వారు పోలీసులపై ఎదురుదాడి చేయడంతో ఎన్కౌంటర్ చేసినట్టు తెలుస్తుంది. దిశని కాల్చిన చోటే నిందితులని ఎన్కౌంటర్ చేయడంతో దిశ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆ ప్రాంతాన్ని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ పరిశీలించారు. మరి కొద్ది సేపట్లో ఎన్ కౌంటర్కి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తుంది. " సీన్ రీ కన్ స్ట్రక్ట్ చేస్తుండగా నిందితులు తిరగబడ్డారు. పోలీసుల దగ్గర నుంచి ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో పోలీసులు ఎన్కౌంటర్ చేయగా నలుగురూ చనిపోయారుఈ ఘటనలో మా పోలీసులు ఇద్దరికి గాయాలయ్యాయి."' అని చెప్పారు.