ఒంటరిగా అసహాయ స్థితిలో ఉన్న వెటర్నరీ డాక్టర్ దిశ కు స్కూటీ బాగు చేయిస్తామని మాయమాటలు చెప్పి చెట్లపొదల్లోకి తీసుకు వెళ్లి దారుణంగా కృర మృగాళ్లుగా అత్యాచారం చేసి ఆ పై హత్య చేసిన నలుగురు నింధితులను ఉరి తీయాలని యావత్ ప్రపంచం మొత్తం గళమెత్తింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఆ నీచులకు ఉరే సరి అన్నారు. పార్లమెంట్ లో సైతం దిశ కేసుపై నేతలు దుమ్మెత్తి పోశారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ నిందితులు జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు, ఆరిఫ్లని చంపేయాలని యువత ఆవేశంతో రగిలిపోయింది. మొత్తానికి నలుగురు నీచుల పాపం పండింది.. అన్యాయంగా ప్రాణాలు తీసిన ఉసురు తగిలింది.
దిశ నిందితులు జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు, ఆరిఫ్లని ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. షాద్నగర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా చటాన్ పల్లి బ్రిడ్జి దగ్గరకి నిందితులని తీసుకెళ్ళి విచారిస్తుండగా, వారు పోలీసులపై దాడి చేసే ప్రయత్నం చేశారట. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం పోలీసులు నలుగురు నిందితులని ఎన్కౌంటర్ చేశారు. ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి వ్యవసాయ పొలంలో నలుగురి మృతదేహాలు పడిఉన్నాయి. ఈ క్రమంలో సీపీ సజ్జనార్ ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మరి కొద్ది సేపట్లో ఎన్ కౌంటర్కి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తుంది.
గత నెల 27న వెటర్నరీ వైద్యురాలు దిశని అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా నలుగురు నిందితులని పోలీసులు పది రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. డిసెంబర్ 5న సిట్ చర్లపల్లి జైలులో నిందితులని విచారించింది. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు మృతి చెందారు. ఏది ఏమైనా ఇలాంటి నరరూప రాక్షసులకు తగిన శాస్తి జరిగిందని ప్రజలు, తల్లిదండ్రులు అంటున్నారు.