దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ దారుణ హత్య ఘటనలో...నలుగురు నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు ఈ రోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్కి గురైన సంగతి తెలిసిందే. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం సంఘటన స్థలానికి తీసుకువెళ్లగా...పోలీసుల నుండి తప్పించుకునేందుకు నిందితులు ప్రయత్నించడంతో ఈ క్రమంలో వారిపై ఎన్కౌంటర్ చేసినట్టు సమాచారం. నిందితులని ఎన్కౌంటర్ చేయడం పట్ల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై దిశ తల్లిదండ్రులు సైతం స్పందించారు. నిందితులకి తగిన శిక్ష పడిందని పేర్కొన్నారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిశ ఉదంతంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
`దిశ` ఉదంతం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ అయ్యారు. ఆయన స్పందించకపోవడంపై విమర్శలు వచ్చాయి. అయితే, తన స్పందనను బయటకు చెప్పకపోయినా సీఎం కేసీఆర్ తీవ్రంగా పరిగణించారని సమాచారం. హృదయ విదారకంగా జరిగిన ఈ ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురిచేయడంపట్ల కేసీఆర్ ప్రగాఢ సానుభూతితో ఉన్నారని సమాచారం. అయితే, కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ ఘటన చోటుచేసుకున్న సమయంలో బాధితురాలి కుటుంబాన్ని స్వయంగా పరామర్శించలేకపోయినట్లు తెలుస్తోంది. ఈ కేసు పరిష్కారమయ్యేంత వరకు అన్ని విధాలుగా అండగా ఉండాలని నిర్ణయించారని సమాచారం.
తాజాగా దిశ నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లోనే దిశ కుటుంబ సభ్యులను ప్రగతి భవన్కు పిలిపించి ఓదార్చాలనుకుంటున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా ఒకరిద్దరు అధికారులకు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వారు దిశ కుటుంబ సభ్యులను కలిసి ముఖ్యమంత్రి ఆహ్వానం గురించి చెప్పారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ప్రగతి భవన్కు వచ్చిన రోజు సీఎం తన కుటుంబ సభ్యులతో కలిసి వారితో భోజనం చేయనున్నారు. అదేరోజు ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియాను కూడా ప్రకటించి సంబంధిత మొత్తాన్ని చెక్కు రూపంలో దిశ తల్లిదండ్రులకు అందజేయనున్నారు.