గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపిన వెటర్నరీ డాక్టర్ దిశా ఎన్కౌంటర్ కేసు క్లోజ్ అయ్యింది. వారం రోజులుగా పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేసి ముందుగా నిందితులను పట్టుకున్నారు. కోర్టు వీరికి రిమాండ్ విధించింది. ఓ వైపు విచారణ జరుగుతూ ఉండగానే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మరో వైపు పోలీసులు ముందుగా కేసు నమోదు చేసే విషయంలో దిశ తల్లిదండ్రుల విషయంలో వ్యవహరించిన తీరుపై సైతం విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో నే తెలంగాణ పోలీసులు దిశ కేసు విచారణ వేగవంతం చేసేందుకు ఏకంగా నలుగురు ఎస్పీ స్థాయి అధికారులతో ఏడు బృందాలను ఏర్పాటు చేశారు. ఇక గురువారం అర్ధరాత్రి దాటాక సీన్ రీకన్ స్ట్రక్షన్ చేయాలని పోలీసులు భావించారు. ఈ క్రమంలోనే పగలు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తే సామాన్య ప్రజలు నిందితులపై దాడి చేస్తారని భావించే అర్ధరాత్రి దాటాక పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. అక్కడ నిందితులు పోలీసులపై తిరగబడడంతోనే అక్కడే పోలీసులు ఎన్కౌంటర్ చేసి వీరిని చంపేశారు.
సీన్ రీ కన్స్ట్రక్షన్ ఎలా జరిగిందో వివరణ అడుగుతుండగానే శివ పోలీసు అధికారులపై కాల్పులకు ప్రయత్నించినట్టు పోలీసులు చెప్పారు. ఆ వెంటనే మిగిలిన ముగ్గురు నిందితులు అయిన ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు పోలీసుల దగ్గర నుంచి ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేసి పోలీసుల పైనే తిరుగుబాటుకు ప్రయత్నించారు. అలా వీలు కాకపోవడంతో చివరకు వాళ్లంతా పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.
పోలీసులపై రాళ్ల దాడి చేసి పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు సంఘటనా స్థలానికి 30 మీటర్ల దూరంలోనే మృతిచెందారు. వీరి బాడీలు అక్కడ పొలాలు, తుప్పల మధ్య 30 మీటర్ల దూరంలో పడి ఉన్నాయి. ఇక ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి బయలు దేరారు. వీరితో ఇప్పటికే వనపర్తి ఎస్పీ ఫోన్లో మాట్లాడారు. వీరిని మక్తల్ సీఐ దగ్గరుండి మరీ అక్కడకు తీసుకు వెళుతున్నారు.