వెటర్నరీ డాక్టర్ దిశా హత్యకేసులో నిందితులను కాల్చి చంపేశారు. వారం రోజులుగా ఈ సంఘటన విషయంలో పోలీసులపై విమర్శలు వచ్చాయి. అయితే ఎన్కౌంటర్ చేసి నలుగురు నిందితులను చంపడంతో ఇప్పుడు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్పై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. రాజకీయ, సినిమా, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
అదే టైంలో అటు టీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ను కూడా ప్రశంసిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల సజ్జనార్ ఫొటోల కు ఎక్కడికక్కడ పాలాభిషేకాలు చేస్తున్నారు. ఒక్క మగాడు సీపీ సజ్జనార్. ఆడపడుచులకు పెద్దన్న అంటూ మెచ్చుకుంటున్నారు. ఇక సజ్జనార్ విషయానికి వస్తే ఆయన కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ జిల్లా కేంద్రమైన హుబ్బిలికి చెందిన వారు. ఆయన 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. అంతకుముందు సమైక్య రాష్ట్రంలో వరంగల్, నల్లగొండ ఎస్సీగా కూడా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడంతో ఆయనను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు.
ఆయన ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. వృత్తి రీత్యా తన కింది ఉద్యోగులతో చాలా అన్యోన్యంగా ఉండాలని చెబుతారు. ఆయనను కింది ఉద్యోగులు ఇష్టపడుతుంటారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కి హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో ఉన్న పలు ప్రాంతాలు వస్తాయి. ఇవన్నీ అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు కావడం విశేషం. మాదాపూర్, బాలనగర్ జోన్లు ఈ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఇక నయీం ఎన్కౌంటర్ సమయంలో కూడా ఆయన స్పెషల్ ఇంటెలిజెన్స్ విభాగం ఐజీగా ఉన్నారు.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అలిపిరి వద్ద మావోయిస్టులు జరిపిన దాడి కేసులో కీలక సూత్రధారిగా ఉన్న నక్సల్స్ నేత ఎం సుధాకర్ రెడ్డి ఎన్కౌంటర్లో ఆయన కీలకపాత్ర పోషించినట్లు చెబుతారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా 2018 మార్చి 14న బాధ్యతలు చేపట్టిన వెంటనే కీలకమైన ప్రకటన చేశారు. తాను ముందుగా మహిళలు, పిల్లల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఇక శాఖాహారి అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ప్రతిరోజు ఆయన పూజలు కూడా చేస్తారని సమాచారం.