దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దిశ హత్యకేసు అనంతరం షాద్నగర్ శివారులో జరిగిన ఎన్కౌంటర్లో దిశ హత్య కేసు నిందితులు మరణించడంతో దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ పోలీసులు నలుగురు మృగాళ్లను మట్టుబెట్టడంతో ఇప్పుడు యావత్ దేశం తెలంగాణ రాష్ట్రం వైపే చూస్తోంది. ప్రధానంగా పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే, ముఖ్యంగా మూడు సంఘటనలు తెలంగాణ పోలీసులను హీరోలను చేశాయని అంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో భూదందాలు, సెటిల్మెంట్లు, కిడ్నాప్లు, హత్యలు తదితర అరాచకాలతో హడలెత్తించిన నయీం ఎన్కౌంటర్ పోలీసుల గ్రాఫ్ను అమాంతం పెంచిందని చెప్తున్నారు. దీంతోపాటుగా జైలు నుంచే విద్రోహ చర్యలకు పాల్పడిన కరడుగట్టిన ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్కౌంటర్ సైతం వారికి మంచిపేరును తెచ్చిపెట్టింది. దీంతోపాటుగా ఎందరో దుర్మార్గుల పీచమణిచి హైదరాబాద్లో ప్రశాంతత నెలకొల్పారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణలో శాంతిభద్రతల రక్షణకు సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నా రు. దీనిలో భాగంగా పోలీసులకు సకల సౌకర్యాలు కల్పించడంతోపాటు రాష్ట్రంలో రౌడీయిజం, అన్యాయాలు, అక్రమాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ తావుండకూడదని సుస్పష్టమైన ఆదేశాలివ్వడంతోనే పోలీసులు ఈ మేరకు కఠిన చర్యలు తీసుకున్నారని అంటున్నారు.
కాగా, శుక్రవారం దిశ నిందితులను ఎన్కౌంటర్ చేశారన్న వార్త ప్రపంచమంతా దావానలంలా వ్యాపించింది. గుగుల్ ట్రెండ్స్లో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఎన్కౌంటర్ విషయాలపై వంద శాతం శోధన జరిగింది. 50 వేల మందికిపైగా నెటిజన్లు తెలంగాణ సీఎం గురించి శోధించారు. సజ్జనార్ పోలీస్ పేరుతో శోధనలు జరిపి ఎన్కౌంటర్ వార్త విషయాలు తెలుసుకున్నారు. మొత్తంగా దిశ నిందితుల ఎన్కౌంటర్ వార్తతోనే గూగుల్ మార్మోగింది. గూగుల్ ఇండియా ట్రెండ్స్ సెర్చ్లో సుమారు 20 లక్షలకుపైగా నెటిజన్లు శోధించడం విశేషం. నవంబర్ 27న దిశ ఘటన జరిగినప్పటినుంచి ఈ విషయమై ప్రతి రోజు ఏం జరుగుతున్నది? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అధికారులు ఎలా స్పందిస్తున్నారు? నిందితులకు ఎలాంటి శిక్షలు పడుతున్నాయి? ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? తదితర వివరాలను ఇంటర్నెట్ ఆధారంగా తెలుసుకున్నారు.