ప‌క్క రాష్ట్రం కర్ణాటక‌లో మరోమారు రాజ‌కీయ ఉత్కంఠ నెల‌కొంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కీల‌క‌మైన క‌ర్ణాట‌క‌లో ఆ పార్టీ రాజకీయ భ‌విష్య‌త్‌ను ఉప ఎన్నిక‌లు తేల్చ‌నున్నాయి. అనర్హత ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తుతో పాటుగా యెడ్యూరప్ప నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ మనుగడకు కీలకంగా మార‌డంతో పాటుగా బీజేపీకి అధికారం నిలుస్తుందా అనే ఉత్కంఠ కూడా నెల‌కొంది.

 

15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు జ‌రిగాయి. ఈ నెల 9వ తేదీన ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు. బీజేపీ ప్రభుత్వం సొంతంగా మెజారిటీ సాధించాలంటే కనీసం 8 స్థానాల్లో గెలవాల్సి ఉంది. మొత్తం 15 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ అన్ని స్థానాల్లోను, జేడీఎస్‌ 12 చోట్ల పోటీలో ఉంది. అనర్హతకు గురైన ఎమ్మెల్యేల్లో 13 మంది బీజేపీ తరఫున బరిలో దిగారు. కోర్టు కేసులున్నందున మస్కి, రాజరాజేశ్వరి నగర నియోజకవర్గాలకు ఎన్నికలు జరగలేదు. గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. 15 నియోజకవర్గాల్లోని మొత్తం 37.78 లక్షల మంది ఓటర్లలో సాయంత్రం 6 గంటల వరకు 66.59% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. హోసకోటెలో అత్యధికంగా 90.44%, కృష్ణరాజపురంలో అత్యల్పంగా 43.25% పోలింగ్‌ నమోదైందని తెలిపారు. బెంగళూరు పరిధిలోని మహాలక్ష్మి లేఅవుట్‌లో 50.92%, శివాజీనగరలో 44.60%, యశ్వంత్‌పురలో 54.13% పోలింగ్‌ నమోదైందన్నారు.

 


మొత్తం 15 స్థానాల్లో, బీజేపీకి 10, కాంగ్రెస్‌కు 2 నుంచి 4, జేడీఎస్‌ 2 సీట్లు లభిస్తాయని పలు సర్వేలు అంచనా వేశాయి. ఈ 15 స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 12, జేడీఎస్‌ 3 సీట్లలో గెలుపొందాయి. ఈ ఉప ఎన్నికల్లో అధిక స్థానాల్లో బీజేపీనే గెలిచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సీఎం యెడ్యూరప్ప 15 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: