కాదేదీ దొంగతనానికి అనర్హం అన్నట్టు ఈ మద్య దొంగలు చాలా అడ్వాన్స్ అవుతున్నారు.. ఎవరి ఇంటినైనా ఇట్టే దోచేయొచ్చు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఏకంగా తెలంగాణ డిప్యూటీ సీఎం ఇంటికే కన్నం వేయబోయి అడ్డంగా బుక్కయ్యారు. వివరాల్లోకి వెళితే, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్ ఇంటికి నిన్న రాత్రి కన్నం వేయబోయి ఐదుగురు నిందితులు పట్టుబడ్డరు. 

 

నిన్న అర్ధ రాత్రి సమయంలో పద్మారావు ఇంటి ప్రహరీ గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు, మెల్లగా ఇంటి ముందు వసారాకు ఉన్న గ్రిల్స్ ని కత్తిరించి లోపలి వెళ్లేందుకు ప్రయత్నించగా వెంటనే ఆయన ప్రత్యేక భద్రతా సిబ్బంది అలర్ట్ అయి వారిని పట్టుకుని అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే ఇందులో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పట్టుబడిన ఆ ఐదుగురు దొంగల్లో ఒక వ్యక్తి పద్మారావు ఇంటి ప్రక్కనే వ్యక్తే అని, అసలు ఆ ఐదుగురు ఏ ఉద్దేశ్యంతో పద్మారావు ఇంట్లో చొరబడ్డారు అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. 

 

ఇంటి చుట్టూ భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ కూడా దొంగలు ప్రహరీ గోడ కూడా దూకి ఇంట్లోకి ప్రవేశించారంటే ఈ ఘటనలో ఇంకెవరైనా ఉన్నారా అనే విషయమై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక నూతన తెలంగాణ ఏర్పడ్డ తరువాత జరిగిన ఎన్నికల్లో గెలిచిన పద్మారావు, అప్పట్లో క్రీడలు మరియు ఎక్సయిజ్ శాఖా మంత్రిగా కూడా పని చేయడం జరిగింది. ఆ తరువాత అయన సేవలకు మెచ్చి మొన్నటి ఎన్నికల తరువాత ఆయనకు డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకోవడం జరిగింది.

 

ఎంతో ధైర్యంగా ఇంట్లోకి ప్రవేశించారంటే వారి వెనక పెద్ద ప్లాన్ ఉండి ఉంటుందని, కావున పోలీసులు కఠినంగా వ్యవహరించి దొంగల నుండి నిజానిజాలు బయటపెట్టాలని పద్మారావు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇక ఈ ఘటన నేడు పలు రాజకీయ వర్గాల్లో కొంత కలకలాన్ని రేపుతోంది. మరి ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్దిరోజలు ఓపిక పట్టాల్సిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: