ప్రపంచ స్థాయి బ్యాడ్మింటర్ క్రీడాకారిణి పీవీ సింధు ఏపీలో గ్రూప్ వన్ ఆఫీసర్ అన్న సంగతి తెలిసిందే. ఆమెకు చంద్రబాబు హాయంలో ఈ పోస్టు ఇచ్చారు. ఇప్పుడు ఆమె డిప్యూటీ కలెక్టర్‌గా ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే జాబ్ లో జాయిన్ కావాల్సి ఉంది.శిక్షణా కాలం పూర్తి చేసుకుని పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న పీవీ సింధుకు సీఎం వైఎస్ జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

 

హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌ వద్ద ఓఎస్‌డీగా పీవీ సింధుకు పోస్టింగ్‌ ఇచ్చారు. అంతే కాదు.. పీవీ సింధు త్వరలో ఇంటర్నేషనల్ టోర్నీల కోసం ప్రిపేర్ కావాల్సి ఉంది. అందుకే ఆమె ఆన్ డ్యూటీ సెలవు మంజారు చేశారు.. నెల, రెండు నెలలు కాదు.. ఏకంగా.. 9 నెలల పాటు సెలవు మంజూరు చేశారు. పీవీ సింధుకు 2019 డిసెంబర్‌ 7 నుంచి 2020 ఆగస్టు 30 వరకు ఆన్‌ డ్యూటీ సౌకర్యం మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

 

ఈ మేరకు ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద అక్కడ ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టును ఓఎస్‌డీగా అప్‌గ్రేడ్‌ చేశారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ప్రొటోకాల్‌ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.బ్యాడ్మింటన్ క్రీడాకారిణికి గౌరవార్థం ఏపీ ప్రభుత్వం ఈ పోస్టు ఇచ్చింది.

 

ఇక హైదరాబాద్ లేక్‌ వ్యూలో పోస్టు అంటే.. పెద్దగా పనేమీ ఉండదనే చెప్పుకోవాలి. అసలు ఆ గెస్ట్ హౌజ్ ను ఏపీ ప్రభుత్వం వాడటమే లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఏపీకి సంబంధించివారు వస్తే వాడుకోవడం కోసమే అది ఉంది. మరో ఐదేళ్ల పాటు ఈ గెస్ట్ హౌజ్ ఏపీ ఆధీనంలోనే ఉంటుంది. బహుశా అప్పటి వరకూ సింధుకు ఈ పోస్టు కంటిన్యూ కావచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: