2017 లో కర్నూలుకు చెందిన 14 ఏళ్ల మైనర్ బాలిక అత్యాచారంకు సంబంధించిన అంశాన్ని అసెంబ్లీలో హత్యకేసు అంశాన్ని మంత్రులు కొడాలి, పేర్ని నానిలు ప్రస్తావించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా మాట్లాడారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన పై తమ ఆవేదనను, బాధను వ్యక్తం చేస్తున్న మంత్రులు.. ఈ బాలిక అంశాన్ని కూడా ప్రస్తావించి ఆమెకు న్యాయం చేసేలా పోరాటం చేయాలన్నారు.
దిశ విషయంలో మంత్రులు నాని బ్రదర్స్ తెగ బాధపడ్డారని.. కాబట్టి ఆ ఇద్దరు సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బాలిక ప్రీతి అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలన్నారు. 14 ఏళ్ల సుగాలి ప్రీతి 10వ తరగతి కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో చదువుతుండగా రెండేళ్ల క్రితం అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి ఉరి తీయబడింది అన్నారు. ఆమె పోస్ట్ మార్ట్ రిపోర్టులు బయటకు ఎందుకు తీసుకురావడం లేదని, జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇది కూడా మాట్లాడాలన్నారు.
ఈ విషయమై మంత్రి కొడాలి నానికి చెబుతున్నానని అసెంబ్లీలో కచ్చితంగా మాట్లాడాలన్నారు. న్యాయం జరిగేలా పోరాటం చేయాలని.. ఒకవేళ మంత్రి అసెంబ్లీలో ప్రస్తావించకపోతే.. జనవరిలో కర్నూలుకు వెళ్లి.. భవన నిర్మాణ కార్మికులకు కోసం ఎలాంటి లాంగ్ మార్చ్ చేశామో.. సుగాలి ప్రీతి కోసం తాను రోడ్డు మీద జనసైనికులతో నడిచి వాళ్లకు న్యాయం జరిగే వరకూ అండగా నిలబడతామన్నారు.
దిశ ఘటనపై తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. దిశను చంపిన వారిని రెండు బెత్తం దెబ్బలు కొట్టాలని తాను చెప్పలేదని.. తాను తప్పుగా మాట్లాడలేదన్నారు. దోషులను బహిరంగంగా శిక్షించాలని అన్నానని.. సౌదీ అరేబియా, సింగపూర్ తరహాలో శిక్షలు ఉండాలన్నదే తన అభిప్రాయమని వ్యాఖ్యానించారు. బహింరంగంగా దోషుల కాళ్లు, చేతులను తీసేయాలని అప్పుడే తప్పు చేయడానికి వారు భయపడతారన్నారు.