హైదరాబాద్ షాద్నగర్ వైద్యురాలు దిశా ని అతి దారుణంగా నలుగురు కామాంధులు అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశం ఒక్కసారిగా భగ్గుమంది. కేసులో నిందితులను వెంటనే ఉరి శిక్ష విధించి చంపేయాలి అంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అటు తెలంగాణ ప్రభుత్వం పై కూడా దిశా రేప్ కేస్ ఘటనపై రోజురోజుకు ఒత్తిడి పెరిగి పోయింది. మరోసారి ఆడపిల్లలపై చేయి వేయాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చేలా దిశా నిందితులను శిక్షించాలని దేశ ప్రజానీకం మొత్తం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు గత శుక్రవారం దిశ కేసులోని నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేశారు. కేసు రీ కన్స్ట్రక్షన్ చేసిన సమయంలో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నిస్తే ఎన్కౌంటర్ చేయక తప్పలేదని దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు.
కాగా వైద్యురాలు దిశ అత్యాచారం చేసిన అనంతరం అక్కడే హత్య చేసినట్లు నిందితుల విచారణలో తేలిన విషయం తెలిసిందే. అయితే అత్యాచారం చేసిన అనంతరం దిశ మృతదేహాన్ని లారీలో 27 కిలోమీటర్ల పాటు తరలించి అక్కడ పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు విచారణలో తేలింది.కాగా దిశా మృతదేహాన్ని తరలిస్తున్న లారీని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియోని ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు విడుదల చేశారు.సీసీ టీవీ లో కనిపిస్తున్న లారీ లోనే దిశా మృతదేహాన్ని తరలించి పెట్రోల్ పోసి కాల్చి వేశారని తెలిపారు పోలీసులు. గత నెల 27న తొండూపల్లీ టోల్ గేట్ నుంచి దిశ మృతదేహాన్ని లారీ ద్వారా తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారానే తాము గుర్తించినట్లు తెలిపారు.
కాగా తొండుపల్లీ టోల్ ప్లాజా వెనుక ఉన్న ఖాళీ ప్రదేశం లోనే దిశ పై నలుగురు నిందితులు అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు తెలిపారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయిపోతుంది. ఇదిలా ఉండగా అటు దిశ నిందితుల ఎన్కౌంటర్పై విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ను నియమించిన విషయం తెలిసిందే. రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడిన బృందం దిశా నిందితుల ఎన్కౌంటర్పై విచారణ చేపడుతున్నారు. కాగా దిశా నిందితుల ఎన్కౌంటర్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా నేడు పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.