అతడు ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్. అతడి నెల జీతం లక్ష పైనే ఉంటుంది. అది చాలదన్నట్టు తన హోదాను అడ్డుపెట్టుకుని నిత్య పెళ్ళికొడుకు అవతారం ఎత్తాడు. అమ్మాయిలను మోసం చేస్తూ కట్నం తీసుకుంటూ అదనంగా సంపాదించాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే అతడి బండారం బయటపడటంతో అడ్డంగా బుక్ అయ్యాడు. తిరుపతి ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తున్న మోహన్కృష్ణ ఇద్దరు అమ్మాయిలను మోసం చేద్దామనుకొని తానే దొరికిపోయాడు.
మోహన్కృష్ణకు ముందు మహబూబ్నగర్ జిల్లా మక్తల్కు చెందిన యువతిని పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. దీనికోసం 16 లక్షల నగదు, 6 తులాల బంగారం కూడా తీసుకున్నాడు. ఎంగేజ్మెంట్ అయ్యాక జాతకాలు కలవలేదని.. నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. వాళ్ల దగ్గర తీసుకున్న డబ్బు, బంగారం తిరిగి ఇవ్వమని అడిగితే కుదరదన్నాడు. ఇక అదనపు కట్నం కోసం ఆశపడి కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన యువతినిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు.
ఆమె దగ్గర కూడా ఇప్పటికే కట్నంగా డబ్బు, బంగారం తీసుకున్నాడు. ఆదివారం నంద్యాలలో పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లి జరుగుతోన్న టైంలో మొదటి యువతి బంధువులు అక్కడకు చేరుకున్నారు. అతడిని చితకబాదారు. ఈ విషయం తెలుసుకుని రెండో యువతి బంధువులు కూడా నాలుగు తగిలించారు. ఇక ఫిర్యాదు అందుకున్న పోలీసులు మోహన్కృష్ణను కళ్యాణ మండపం నుంచే పెళ్లి డ్రెస్తో పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్లారు.
ఇక పోలీసుల విచారణలో ఇతడి గురించి చాలా విషయాలే తెలిశాయి. ఇక మోహన్కృష్ణ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్గా ఉన్న అతడి జీవితం అంతా మోసాల మయే అని పోలీసుల విచారణలో తేలింది. పదేళ్ల కిందట కెనరా బ్యాంక్లో పని చేస్తున్నపుడే జనం దగ్గర డబ్బు వసూలు చేసి పారిపోయాడు. అప్పుడే అతనిపై కేసు నమోదైంది. ఇప్పుడు పెళ్లి పేరుతో ఇద్దరు యువతులను మోసం చేయడానికి ప్రయత్నించి బుక్కయ్యాడు.