ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖా  మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని  ముక్కు సూటి మనిషి అని,  ఆయనకు నోటి దురుసు కూడా చాలా ఎక్కువని ఇటీవల టీడీపీ నాయకులపై చేసిన వ్యాఖ్యలను చూస్తే అర్థమవుతుంది. కొడాలి నానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి మిత్రుడు, ఆప్తుడు అనేది  అందరికీ తెలిసిందే. నానిని ఎన్టీఆర్ 'అన్న' అని ఆప్యాయంగా పిలుస్తారు. కాకపోతే, నాని వైసీపీలో చేరిన తరవాత వీరిద్దరి మధ్య దూరం కాస్త పెరిగింది అనేది వాస్తవమే  కానీ, వాళ్ల మధ్య ప్రేమ మాత్రం పదిలంగానే ఉందని నాని మాటలు వింటే అర్థమవుతుంది.
 
కొడాలి నాని తాజాగా ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తనకన్నా చాలా చిన్నవాడని.. ఇద్దరి మధ్య 11 నుంచి 12 ఏళ్ల తేడా ఉందని అన్నారు. అతన్ని చూస్తే ఎన్టీ రామారావు గారిని చూసినట్టు ఉంటుందని చెప్పారు. ‘‘ఇది చెప్పకూడదేమో.. ఎందుకంటే తిడతారు. పెద్ద ఎన్టీఆర్ నటన చూశా, ఆయన డ్యాన్సులు చూశా, ఆయన హావభావాలు చూశా. ఆయన కన్నా గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్. నేను చెప్పేది వాస్తవం. ఎన్టీ రామారావు గారి కన్నా మంచి నటుడు తారక్. ఆయన కొన్ని పాత్రలకు బ్రహ్మాండంగా సెట్ అవుతారు. కొన్నిటికి ఆయన సెట్ అవ్వరు. కానీ, జూనియర్ ఎన్టీఆర్‌కి సినిమా స్క్రీన్‌పై ఎదురులేదు. డ్యాన్స్ దగ్గర నుంచి ఏదైనా చేయగలడు. ఏ పాత్రనైనా చేయగలిగే సత్తా ఉన్న స్టార్’’ అని జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు నాని.
  
జూనియర్ ఎన్టీఆర్‌కు ఇష్టం లేకపోయినా బలవంతంగా 2009 ఎన్నికల్లో ప్రచారానికి తీసుకెళ్లానని, ఇచ్చాపురం నుంచి ఖమ్మం వరకు ఎన్టీఆర్ చేపట్టిన ప్రచార యాత్రకు విపరీతంగా జనం వచ్చారని చెప్పారు. తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తే ప్రజలకు ఏం చేస్తుంది అనే విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పిన పొలిటిషియన్ జూనియర్ ఎన్టీఆర్ అని నాని అన్నారు. 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో టీడీపీ ఓటమి పాలైంది. దీనిపై నాని స్పందిస్తూ.. ‘‘టీడీపీకి పట్టులేని చోట ప్రచారానికి ఎన్టీఆర్‌ను తీసుకెళ్లారు. ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్‌ దాటి ఖమ్మం వరకు ఎన్టీఆర్ ప్రచారం చేశాడు. ఈ అన్ని చోట్ల చిరంజీవి ప్రభంజనం ఉంది. కాంగ్రెస్‌, పీఆర్పీల మధ్య గట్టి పోటీ ఉంది. అలాంటి చోట ప్రచారం చేసి టీడీపీని పోటీలోకి తీసుకొచ్చాడు ఎన్టీఆర్. పీఆర్పీని మూడో స్థానంలోకి పంపి కాంగ్రెస్, టీడీపీ మధ్య ప్రధాన పోరు జరిగేలా చేశాడు’’ అని వివరణ ఇచ్చారు.
 

ప్రస్తుతం టీడీపీ స్టేజ్ 2ను దాటి స్టేజ్ 3కి చేరువ అవుతుందని అన్నారు నాని. ఈ స్టేజ్‌లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి బాధ్యతలు తీసుకోకుండా స్టేజ్ 4లోకి వెళ్లాక బతికిద్దాం అనుకుంటే అది జరగదని అన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తుక్కుతక్కుగా ఓడిపోవడం ఖాయమని.. ఆ తరవాత పెద్ద ఎన్టీఆర్ వచ్చినా పార్టీని కాపాడలేరని తేల్చి చెప్పారు. 2029 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ సీఎం అభ్యర్థిగా పోటీ చేసినా తాను జగన్ వైపే ఉంటానని నాని స్పష్టం చేశారు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్‌తోనే ఉండాల్సి వస్తే రాజకీయాలు వదిలేస్తానన్నారు. చచ్చేవరకు జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటానని ఉద్ఘాటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: