దిశ అత్యాచారం, హత్య కేసు ఎంత సంచలనం సృష్టించిందో.. రేపిస్టులు ఎన్ కౌంటర్ కూడా అంతే సంచలన సృష్టిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు సైబరాబాద్ పోలీసులకు ఇబ్బందిగా మారింది. అటు ఎన్ హెచ్ ఆర్ సీ విచారణ..మరోవైపు పోలీసుల విచారణ.. ఇంకో వైపు కోర్టుల్లో కేసులు..ఇలా ఈ కేసు మరింత సంచలనంగా మారుతోంది.
తాజాగా అప్ డేట్ ఏంటంటే.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసులో నిందితుల ఎన్కౌంటర్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా సుప్రీంకోర్టులో విచారణకు హాజరుకాబోతున్నారు. దిశ ఘటనలో సేకరించిన సమాచారాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.
ఈ మొత్తం వ్యవహారంలో మొదట పోలీసులపై ప్రశంసల వర్షం కురిసినా చట్టాలు మాత్రం వారికి ఇబ్బందికరంగానే మారాయి. ఎంతటి నేరస్తులలైనా పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఇప్పుడు కోర్టుల్లో కేసులకు కారణమైంది. అందుకే సుప్రీంలో విచారణ..అందుకు సజ్జనార్ స్వయంగా హాజరుకావడం ఆసక్తి రేపుతోంది.
మరోవైపు.. నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ నాలుగోరోజు కూడా కొనసాగింది. తెలంగాణ పోలీసు అకాడమీలో ఎన్హెచ్ఆర్సీ బృందం.. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను విచారించింది. షాద్నగర్, శంషాబాద్ పోలీసులను కూడా కమిషన్ సభ్యులు విచారించారు. నిందితులు పెట్రోల్ పోయించుకున్న బంకులో పనిచేస్తున్న సర్వీస్మెన్ ప్రవీణ్ను పోలీస్ అకాడమీకి పిలిపించి విచారించారు. ఇది కూడా కీలకంగా మారనుంది.