ఒకనాడు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కు తరలిరాని రోజుల్లో సినిమా రంగం చెన్నైలో ఉండేది. తెలుగు, తమిళ సినిమాలు రెండు అక్కడే షూటింగులు జరుపుకునేవారు. ఆలా అక్కడ షూటింగ్ లు జరిగే రోజుల్లో ప్రతి ఒక్కరు సినిమా రంగంలోకి అడుగుపెట్టాలి అనుకుంటే తప్పని సరిగా మద్రాస్ రైలెక్కి అక్కడికి వెళ్లేవారు. టి నగర్ లో స్టార్స్ ఉండేవారు. ఆ చుట్టుపక్కలే స్టూడియోలు వగైరా ఉండేవి. సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్న వ్యక్తులు చెన్నై రాగానే మొదట వెళ్ళేది పాండి బజార్ కి.
అక్కడి నుంచే వారి ప్రస్థానాన్ని కొనసాగిస్తారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, ఆ తరువాత రోజుల్లో చిరంజీవి, మోహన్ బాబు తదితరులు పాండి బజార్ లో ఉండి అక్కడే ఉన్న పబ్లిక్ టాప్ లో నీళ్లు తాగి, పానగల్ పార్క్ లో పడుకొని షూటింగ్ కు వెళ్తుండేవారు. అప్పట్లో పాండి బజార్ లో జనం ఇసుకేస్తే రాలేనట్టుగా ఉంటారు. ఎందుకంటే చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద పెద్ద షాపుల వరకు అక్కడ ఉంటాయి.
సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఏం కావాలన్నా అక్కడికి వచ్చే కొనుగోలు చేసేవారు. అక్కడే అన్ని దొరికేవి. కాలం మారిపోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చింది. చెన్నైలో టి నగర్ ప్రాంతం అత్యంత సుందరంగా మారిపోయింది. అమ్మ జయలలిత అధికారంలోకి వచ్చిన తరువాత పాండి బజార్ లోని విస్తరించారు. రోడ్డుకు అటు ఇటు పది మీటర్ల దూరంలో షాపులు జరిపారు.
ఇక చిన్న చిన్న వర్తకుల కోసం ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి వారికీ అక్కడ షాపులు ఇచ్చారు అమ్మ జయలలిత. ఇక ఇదిలా ఉంటె, కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలో భాగంగా టి నగర్ ను స్మార్ట్ సిటీగా తీర్చి దిద్దాలని అనుకుంది. ఒకప్పటి పాండి బజార్, టి నగర్ ను చూసిన వ్యక్తులు ఇప్పుడు వెళ్లి ఆ రెండు ప్రదేశాలను మరోసారి చూస్తే నిజంగా షాక్ అవుతారు. అసలు మనం పాండి బజార్ లో ఉన్నామా లేందంటే ఏదైనా ఫారెన్ లొకేషన్లో ఉన్నామా అనిపించక మానదు.