ఇంగ్లీష్ మీడియం బోధనపై ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా వాడి వేడి చర్చ జరిగింది. ఈ సందర్బంగా జగన్ ఓ కొత్త స్లోగన్ ఇచ్చారు.. అదే.. ఆర్. టీ. ఇ. అంటే.. రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్.. అంటే ఏపీలోని ప్రతి పాఠశాల పిల్లవాడికీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువు ఓ హక్కు అన్నమాట. ఈ సందర్భంగా జగన్ ఆవేశపూరితంగా ప్రసంగించారు.
రేషనలైజేషన్ పేరుతో 2014-19 మధ్యలో 6 వేల స్కూళ్లను మూసేశారని జగన్ అన్నారు. కనీస వసతులుండవు. అక్టోబర్ వచ్చినా పిల్లలు యూనిఫాంలు, పుస్తకాలు రావు. ఆరు నెలలపాటు మధ్యాహ్న భోజన బిల్లులు రావు, వంట మనుషులకు జీతాలివ్వరు. ఇదంతా గవర్నమెంట్ స్కూళ్లను నిర్వీర్యం చేసే కుట్ర.పేదవాడు సంక్షేమం గురించి ఆలోచన లేని వ్యక్తి వ్యవస్థలను భ్రష్టుపట్టించిన వ్యక్తి చంద్రబాబే. అందుకే చెబుతున్నా రైట్ ఎడ్యుకేషన్ కాదు.. మన రాష్ట్రంలో ఇకపై రైట్ టు ఇంగ్లిష్ ఎడ్యుకేషన్ స్లోగన్ రావాలి అన్నారు జగన్.
నాడు నేడు కార్యక్రమం ద్వారా 44వేల స్కూళ్లను రెండేళ్లలో మార్చబోతున్నాం. చంద్రబాబు అయిదేళ్లు పాలన చేసి కనీసం రూ. 50 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. మేము నాడు -నేడు కార్యక్రమం ద్వారా రెండేళ్లలో మూడు ఫేజుల్లో 44 వేల స్కూళ్లను మార్చబోతున్నాం. మొదటి ఫేజ్లో 17,715 స్కూళ్లలో మౌలిక వసతులు కల్పనకు రూ. 3,600 కోట్లు కేటాయిస్తున్నాం. జనవరి 1 నుంచి అమ్మ ఒడి పథకాన్ని అమలు చేయబోతున్నాం... అని తన ప్రణాళిక వివరించారు జగన్.
మన పిల్లలు ప్రపంచంతో పోటీపడేలా స్కూళ్లను మార్చుబోతున్నాం. విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నాం. ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజీని ఏర్పాటు చేస్తాం. దేశవిదేశాల్లో మన పిల్లలకు గుర్తింపు దక్కుతుందని విశ్వసిస్తున్నాం కాబట్టే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నాం. మేం తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ముఖ్యమంత్రి.